గూడూరు జంక్షన్ సమీపంలో న‌వ‌జీవ‌న్ ఎక్స్‌ప్రెస్ రైలులో చెల‌రేగిన మంట‌లు

Fire Breaks out Navjeevan Express near Gudur Junction.న‌వ‌జీవ‌న్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Nov 2022 3:03 AM GMT
గూడూరు జంక్షన్ సమీపంలో న‌వ‌జీవ‌న్ ఎక్స్‌ప్రెస్ రైలులో చెల‌రేగిన మంట‌లు

న‌వ‌జీవ‌న్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. అహ్మ‌దాబాద్ నుంచి చెన్నై వెలుతున్న న‌వ‌జీవ‌న్ ఎక్స్‌ప్రెస్ రైలు తిరుప‌తి జిల్లా గూడూరు జంక్ష‌న్ స‌మీపానికి వ‌చ్చే స‌రికి.. రైలులో మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌తో ప్ర‌యాణీకులు భ‌యాందోళ‌న‌కు గురైయ్యారు. రైల్వే సిబ్బంది అప్ర‌మ‌త్త‌తో పెను ప్ర‌మాద‌మే త‌ప్పింది.

ప్యాంట్రీ కార్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గ‌మ‌నించిన సిబ్బంది గూడూరు రైల్వే స్టేష‌న్‌లో రైలు ఆపి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. ఈ అగ్నిప్ర‌మాదం కార‌ణంగా న‌వ‌జీవ‌న్ ఎక్స్‌ప్రెస్ రైలు గంట పాటు గూడూరు రైల్వే స్టేష‌న్లోనే నిలిచిపోయింది. ఇక‌ ఈ ఘ‌ట‌న‌లో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అటు అధికారులు, ఇటు ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. రైలును త‌నిఖీ చేసిన అధికారులు అనంత‌రం చైన్నైకి వెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చారు. ఇక ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టామ‌ని తెలిపారు.

ఇదిలా ఉంటే.. గతంలోనూ దక్షిణ్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ఘటన జరిగింది. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును అక్కడే నిలిపివేశారు. మంటలు చెలరేగిన బోగీని అక్కడే వదిలేశారు. అనంత‌రం మంట‌ల‌ను ఆర్పి వేశారు.

Next Story