తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు హోటళ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్స్ పంపారు. హోటళ్ల యాజమాన్యాలు తీవ్ర ఆందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించాయి. తిరుపతిలోని కపిలతీర్థం సమీపంలో ఉన్న రెండు హోటళ్లకు బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్స్ అందాయి. హోటళ్ల నిర్వాహకులు అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆయా హోటళ్లకు చేరుకున్నారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. ఎలాంటి బాంబులు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజుల క్రితమే తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యాలయం, రైల్వే స్టేషన్కు కూడా ఇలాగే ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.