వచ్చే రెండు వారాలు అత్యంత బాధాకరంగా గడవనున్నాయి.. సిద్ధంగా ఉండండి
By Newsmeter.Network
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ .. అగ్రరాజ్యమైన అమెరికాపై తీవ్ర ప్రతాపం చూపుతోంది. కరోనా దాటికి అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. గడుస్తున్న ఒక్కో రోజు ఆ దేశ చరిత్రలో చీకటి దినంగా మిగిలిపోతోంది. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 1,76,518 మంది ఈ కరోనా వైరస్ భారిన పడి ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతుండగా.. 3,896 మంది మృత్యువాత పడ్డారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ సేకరించిన సమాచారం ప్రకారం.. అమెరికాలో 24గంటల్లోనే 856 మంది కరోనా మహమ్మారికి బలైనట్లు తెలుస్తోంది.
Also Read :ఏకతాటిపైకి రాకుంటే.. మానవ సంక్షోభం తప్పదు – ఐక్యరాజ్య సమితి
ప్రపంచంలోని అన్ని దేశాల్లో కంటే అమెరికాలోనే కరోనా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. కరోనా వైరస్ మరణాలను చూస్తే మొదటి స్థానంలోస్పెయిన్ (8,269) ఉండగా, తరువాతి స్థానం అమెరికాదే. ఇక చైనాలో 3,305 మంది కరోనా వైరస్తో మృత్యువాత పడ్డారు. కరోనా పాజిటివ్ కేసులు మాత్రం అమెరికాలో వేగంగా పెరుగుతున్నాయి. ఇక్కడ 1,76,518 మందికి కరోనా వైరస్ సోకింది. తరువాతి స్థానంలో ఇటలీలో 1,05, 792 మంది కరోనా వైరస్ భారిన పడి చికిత్స పొందుతున్నారు. మిగిలిన దేశాల్లో లక్షలోపే కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.
Also Read :ఈ రోజు నుంచి ఆ బ్యాంక్లు కనిపించవు.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. కరోనా మహమ్మారి ఓ పీడ కలలాంటిదని అన్నారు. వచ్చే రెండు వారాలు అత్యంత బాధాకరంగా, భయంకరంగా గడవనున్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. మరికొన్ని రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు రానున్నాయని, ఎదుర్కోవడానికి ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రానున్న 30 రోజులు అత్యంత కీలకమని ట్రంప్ గుర్తు చేశాడు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఇప్పటికిప్పుడు అద్భుతం సృష్టించే మందు ఏమీలేదని, కేవలం మన వ్యవహార శైలితోనే దీన్ని తరిమికొట్టగలమని ట్రంప్ పేర్కొన్నాడు. ట్రంప్ వ్యాఖ్యలను చూస్తే అమెరికాలో కరోనా వైరస్ మరింత విలయతాండవం చేయబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.