ఆర్టీసీ కార్మికులను భయపెట్టే వైఖరి మానుకోవాలి: అశ్వత్థామ రెడ్డి
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Nov 2019 7:40 AM GMTముఖ్యాంశాలు
- కార్మికులెవరూ విధుల్లో చేరొద్దు: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్
- చర్చలు లేబర్ యాక్ట్ ప్రకారం జరపాలి: అశ్వత్థామరెడ్డి
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 30వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. తమ డిమాండ్లపై సీఎం కేసీఆర్ మొండి వైఖరికి నిరసనగా సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు మృతి చెందిన కార్మికులకు సంతాపం తెలుపుతూ సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం అన్ని డిపోల దగ్గర విపక్ష నేతలతో కలిసి ధర్నాలు చేపట్టనున్నారు. ఐదవ తేదీన సడక్ బంద్లో భాగంగా రహదారులు దిగ్భందం చేయాలని అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. 6న కుటుంబ సభ్యులతో కలిసి డిపోల వద్ద నిరసన, 7న అన్ని ప్రజా సంఘాలతో నిరసన ప్రదర్శనలు, 8వ తేదీన ఛలో ట్యాంక్బండ్ సన్నాహాక కర్యాక్రమాలు, 9న ఛలో ట్యాంక్బండ్, రెండు గంటల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం సరికాదని అశ్వత్థామరెడ్డి అన్నారు. డెడ్లైన్లు పెట్టడం కేసీఆర్కు కొత్త కాదని.. కోర్టులను కూడా సీఎం కేసీఆర్ డిక్టేట్ చేస్తున్నారని అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులను తొలగించే హక్కు ఎవరికీ లేదన్నారు. డిపో మెనేజర్లు రేపటి సమ్మెకు మద్దతు ఇవ్వాలని అశ్వత్థామరెడ్డి అన్నారు. సమస్యలను పరిష్కరిస్తే.. యూనియన్లను వైండప్ చేస్తామన్నారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఎలా ఇస్తారో చెప్పాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. కార్మికులను భయపెట్టే ధోరణిని వ్యతిరేకిస్తున్నామన్నారు. యాథావిథిగా సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి తెలిపారు.
విధుల్లో చేరుతామని వచ్చారు.. ఆ ఉద్యోగుల పేర్లు తెలుసా..?
మరో వైపు ముగ్గురు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరతామని డీఎమ్లకు రిపోర్టు చేశారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో కండక్టర్ ఎస్కే వలి ఉద్యోగంలో చేరుతానని డీఎమ్కి రిపోర్టు చేశాడు. కామారెడ్డి జిల్లాలోని స్టాఫ్ నెంబర్ 318188 గల ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్ సయ్యద్ హైమత్ కామారెడ్డి డిపో మేనేజర్ గణపతికి రిపోర్టు చేశారు. నాగోల్ బండ్లగూడ బస్ డిపోలో కండక్టర్గా విధులకు హాజరవుతానని డీఎమ్కు ఉద్యోగిని రిపోర్ట్ చేసింది. ఇటీవలే ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఆదేశాల వల్ల తనకు కనువిప్పు కలిగిందని కూకట్పల్లికి చెందిన డ్రైవర్ రాజు కూడా విధుల్లో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాడు.
కేసీఆర్ ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారు: భట్టి విక్రమార్క
హైదరాబాద్: తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నియంత భావాలతో పని చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి సొంతం కాదన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చమని ప్రజలు అధికారం కట్టబెడితే.. రాష్ట్రాన్ని దివాలా తీసే స్థాయికి చేరుకున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ నిర్ణయాలే కారణమన్న ఆయన లాభాల్లో ఉన్న ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టారని ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయమనే కార్మికులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారని తెలిపారు. ప్రతిపక్షాలపై కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారు. ఆర్టీసీని సగం ప్రైవేట్ పరం చేయడం తప్పుడు నిర్ణయమని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు బాధ్యతగా పని చేస్తాయని.. ప్రైవేట్ వ్యవస్థలు లాభాపేక్షతోనే పని చేస్తాయన్నారు. ప్రజల ఆస్తులు, ప్రజల రూట్లు ప్రైవేటీకరణ చేసేందుకు కేసీఆర్ ఎవరు అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని భట్టి సూచించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికులను చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని భట్టి విక్రమార్క్ అన్నారు.