సమయం వచ్చినప్పుడు దళితుడిని సీఎం చేస్తానని చెప్పడం కొత్త కుట్రకు నిదర్శనం : వైఎస్ షర్మిల

కేసీఆర్ నోట మళ్లీ దళిత ముఖ్యమంత్రి మాట.. దళితుల బిడ్డల ఓట్లు అవసరమైతే గానీ దొరకు 10 ఏళ్ల కింద ఇచ్చిన

By Medi Samrat  Published on  19 Nov 2023 9:41 AM GMT
సమయం వచ్చినప్పుడు దళితుడిని సీఎం చేస్తానని చెప్పడం కొత్త కుట్రకు నిదర్శనం : వైఎస్ షర్మిల

కేసీఆర్ నోట మళ్లీ దళిత ముఖ్యమంత్రి మాట.. దళితుల బిడ్డల ఓట్లు అవసరమైతే గానీ దొరకు 10 ఏళ్ల కింద ఇచ్చిన మాట గుర్తుకురాలే అని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అంటూ ఉద్యమంలో దొంగ మాటలు చెప్పి మోసం చేశారన్నారు. స్వరాష్ట్రంలో రెండు సార్లు పీఠమెక్కి దళిత సీఎం అని ఏనాడూ అనలేదని దళితులను అవమానించారు. కనీసం రెండో దఫా ఉప ముఖ్యమంత్రి కూడా ఇవ్వకుండా దళిత సమాజాన్ని కించ పరిచారు. దళిత వ్యక్తి పక్కన కూర్చుంటే పక్కకు నెట్టిన నీచ సంస్కృతి దొర కేసీఅర్ ది అని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. పాలనలో సంక్షేమాన్ని తుంగలో తొక్కి.. మూడెకరాల భూమి నుంచి దళిత బంధు దాక.. బుల్ బెడ్ రూం ఇండ్ల నుంచి కార్పొరేషన్ రుణాల దాక అన్ని మోసాలే అని దుయ్య‌బ‌ట్టారు.

దళిత బిడ్డలకు అనునిత్యం ఆగచాట్లే.. 10 యేండ్ల పాలనలో దళితులపై లాఠీలు జులిపించిన ఘనత కేసీఆర్ ది అన్నారు. దళిత మహిళలను లాకప్ డెత్ చేయించిన నియంత పాలన కేసీఆర్ ది. అసెంబ్లీ వేదికగా దళిత ముఖ్యమంత్రి పై మాట మార్చార‌న్నారు. సమయం వచ్చినప్పుడు దళితుడిని సీఎం చేస్తానని చెప్పడం కొత్త కుట్రకు నిదర్శనం అన్నారు. నిజంగా దళిత బిడ్డను సీఎం చేయడానికి ఇప్పుడు సమయం లేదా.? అర్హతున్న దళిత నాయకులు లేరా? లేక మీ తాలిబాన్ పాలనలో అసలు దళితులకు రాజ్యాధికారం వద్దా? అని ప్ర‌శ్నల వ‌ర్షం కురిపించారు.

ఒకపక్క కొడుకును సీఎం చేసేందుకు మోదీతో తెరచాటు ఒప్పందాలు చేసుకుంటూ.. అవసరం వచ్చినప్పుడు దళిత సీఎం అంటే నమ్మే రోజులు ఇక లేవు అన్నారు. దమ్ముంటే, నిజంగా దళితులపై ప్రేముంటే ఎన్నికల ముందే దళిత ముఖ్యమంత్రి ప్రకటన చెయ్యాల‌ని డిమాండ్ చేశార. లేదంటే ఈ డ్రామాలన్నీ ఎన్నికల కోసమే అని ఒప్పుకోవాల‌న్నారు.

Next Story