కండక్టర్‌ను కాలితో తన్నుతూ బండ బూతులు తిట్టిన యువతి.. సజ్జనార్‌ సీరియస్‌

కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.

By అంజి  Published on  31 Jan 2024 4:25 AM GMT
Attack, Tsrtc, Bus Conductor, Hayatnagar, Hyderabad

కండక్టర్‌ను కాలితో తన్నుతూ బండ బూతులు తిట్టిన యువతి.. సజ్జనార్‌ సీరియస్‌

హైదరాబాద్‌: హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్‌ ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. మొదటి ట్రిప్పులో తన దగ్గర చిల్లర లేదని కండక్టర్‌ విన్నవించిన ఆ మహిళా ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడిందన్నారు.

నిబద్దతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తున్నారని, వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సంస్థ విజ్ఞప్తి చేశారు.

కండక్టర్‌పై ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. హయత్‌నగర్ నుంచి అప్జల్‌గంజ్ రూట్‌లో నడిచే 72 బస్ సర్వీస్‌లో ఒక మహిళ మద్యం సేవించి బస్సులోకి ఎక్కింది. అయితే చిల్లర విషయంలో బస్ కండక్టర్‌‌ను పచ్చి బూతులు తిడుతూ దాడి చేసింది. అంతే కాకుండా పెద్దాయన అని కూడా చూడకుండా కాలితో తన్నింది. బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఎంత వారించినప్పటికీ సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్‌పై దాడికి పాల్పడింది. ఇంత జరుగుతున్నా కండక్టర్ మాత్రం ఒక మహిళ అనే గౌరవంతో సంయమనం పాటించాడు. ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు.

Next Story