తెలంగాణను ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలుపుతాం: సీఎం రేవంత్
తెలంగాణ ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By - Knakam Karthik |
తెలంగాణను ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలుపుతాం: సీఎం రేవంత్
తెలంగాణ ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణను పురస్కరించుకుని ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల తప్పులను సరిదిద్దుతూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. తాము పాలకులు కాదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే సేవకులమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి అందించిన మద్దతు బాధ్యతను మరింత పెంచిందని సీఎం అన్నారు.
ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని, ప్రతి లబ్ధిదారుడికి చేరాలన్నదే తమ ఉద్దేశమని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే మార్చి 6 నుండి 99 రోజుల పాటు అన్ని శాఖల సమన్వయంతో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు పారదర్శకతతో ప్రజలకు అందేలా చూడాలన్నారు. 'తెలంగాణ రైజింగ్-2047' విజన్తో రాష్ట్రాన్ని ఆర్థికంగానే కాకుండా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టడమే తమ లక్ష్యమని, ఈ ప్రయాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.