పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. యుద్ధ వాతావరణం, పలు దేశాల విమానాశ్రయాలను మూసి వేసిన పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్, దుబాయ్ తదితర దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల దౌత్య కార్యాలయాల మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఈ అత్యవసర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతీయుల రక్షణ, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను, పరిస్థితులను దౌత్య కార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ భారత్కు తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్కు విజ్ఞప్తి చేశారు.