సీఎం అభ్యర్థి పరిశీలనలో నేను ఉంటా : ఉత్తమ్

సీఎం అభ్యర్థి పరిశీలనలో నేను ఉంటాన‌ని మాజీ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  5 Dec 2023 12:51 PM GMT
సీఎం అభ్యర్థి పరిశీలనలో నేను ఉంటా : ఉత్తమ్

సీఎం అభ్యర్థి పరిశీలనలో నేను ఉంటాన‌ని మాజీ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. మొదటి నుంచి నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను.. నాకు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయ‌న్నారు. నా వాదన, అభిప్రాయం హై కమాండ్ కు చెప్పా.. వారి అభిప్రాయం వారు చెపుతారని.. హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాన‌న్నారు. సీఎం ఎంపిక విషయంలో ప్రజాస్వామ్య పద్ధతిని అవలంబిస్తున్నామ‌ని ఎక్కడా గందర గోళం లేదన్నారు. నేను గతంలో మిలటరీలో సోల్జర్.. కాంగ్రెస్లోనూ సోల్జర్ నే అన్నారు.

కాంగ్రెస్ లో నేను 7 సార్లు గెలిచాను.. నాకు శక్తి ఉన్నంతవరకూ కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ప్రయత్నం చేశాను.. 35 సంవత్సరాలు గా కాంగ్రెస్ లోనే ఉన్నాన‌ని వివ‌రించారు. గతం లో నేను పీసీసీ అధ్యక్షుడిగా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశానని వెల్ల‌డించారు. సీఎం అభ్యర్థి ఎంపికలో నన్ను కూడా పరిశీలిస్తారని ఆశిస్తున్నాను.. తప్పు లేదనుకుంటున్నాను.. సీఎం అభ్యర్థి ఎంపిక విషయం లో ఆలస్యం చేయడం లేదు..రిజల్ట్ వచ్చి 48 గంటలు కూడా కాలేదు.. కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అయిందని వివ‌రించారు. మీడియా సోషల్ మీడియా రాంగ్ హైప్ క్రియేట్ చేసిందన్నారు.

మూడో తేదీన రిజల్ట్స్ వచ్చింది.. 12 గంటల్లో సీఎల్పీ నిర్వహించి తీర్మానం పాస్ చేశారు..ఎమ్మెల్యే ల అభిప్రాయం తెలియజేశారు. కాంగ్రెస్ కు 70 నుంచి 72 సీట్లు వస్తాయని ఆశించాను. సీఎం రేసులో నలుగురు ఐదుగురు ఉండటం తప్పు కాద‌న్నారు. పార్టీ అంతర్గత విషయాలను బయటకు చెప్పడం తప్పు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు.

Next Story