కేంద్ర ప్రభుత్వ విధానాలు జాతీయ ఆహార భద్రత వ్యవస్థకు ముప్పు: కవిత
Union govt policies are threat to national food security system. కేంద్ర ప్రభుత్వ వరి సేకరణ విధానం వివక్షతో కూడుకున్నదని.. కేంద్ర ప్రభుత్వ విధానాలు
By Medi Samrat Published on 10 April 2022 9:51 AM GMT
కేంద్ర ప్రభుత్వ వరి సేకరణ విధానం వివక్షతో కూడుకున్నదని.. కేంద్ర ప్రభుత్వ విధానాలు జాతీయ ఆహార భద్రత వ్యవస్థకు ముప్పుగా మారుతున్నాయని టీఆర్ఎస్ నాయకురాలు కె.కవిత అన్నారు. ఏప్రిల్ 11 న దేశ రాజధానిలో కేంద్ర వరి సేకరణ విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి నిరసనకు పిలుపును ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి సంబంధించి ఉదయం అశోక రహదారి వద్ద నిరసన స్థలాన్ని పరిశీలించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు, విధానాలు జాతీయ ఆహార భద్రత వ్యవస్థకు ముప్పుగా ఉన్నాయని, రైతుల ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని అన్నారు.
భారత్లో ఏ ప్రభుత్వం కూడా రైతులను పణంగా పెట్టి అభివృద్ధి చెందలేదని, రైతులను విస్మరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న బంజరు తెలంగాణను సుసంపన్నమైన, ఉత్పాదక భూమిగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రతి రైతుకు అండగా నిలుస్తుందని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ పాల్గొంటారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే పారా బాయిల్డ్ రైస్ కాకుండా.. ముడి బియ్యాన్నే కొనుగోలు చేస్తామని కేంద్రం చెబుతోంది.