రాష్ట్రంలోని 562 సినిమా హాళ్లలో ఉదయం పూట పాఠశాలల విద్యార్థుల కోసం సినిమా
Two Week long 75th Independence day Celebrations of Telangana. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 15 రోజులపాటు
By Medi Samrat
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 15 రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగే ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. శాసనసభాపతి, మండలి ఛైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, నగరపాలక మేయర్లు, పురపాలక ఛైర్పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల స్ఫూర్తిని చాటేలా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
ప్రారంభోత్సవంలో 75 మంది వీణ కళాకారులతో వాయిద్య ప్రదర్శన చేశారు. హైదరాబాద్లోని అన్ని జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. 85 మంది వీణ కళాకారులతో దేశభక్తి గీతాలు, ఇసుక కళ (సాండ్ ఆర్ట్)లో స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు, మహిళా యోధుల జీవితాలపై పద్మశ్రీ అలేఖ్య పుంజల ఆధ్వర్యంలో నృత్యప్రదర్శన, లేజర్షో, దేశభక్తి గీతాల ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.
మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూలును ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రభుత్వం 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేయనుంది. ఈ నెల 9 నుంచి 21 వరకు రాష్ట్రంలో 562 సినిమా హాళ్లలో ఉదయం పూట పాఠశాలల విద్యార్థుల కోసం రిచర్డ్ అటెన్బరో నిర్మించిన 'గాంధీ' చిత్రాన్ని ప్రదర్శిస్తారు. ఈ నెల 21న శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు.