రోడ్డు ప్రమాదంలో కండక్టర్‌ మృతి.. బాధిత కుటుంబానికి టీఎస్‌ఆర్టీసీ రూ.40 లక్షల చెక్కు

రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి టీఎస్‌ఆర్టీసీ అండగా నిలిచింది. యూబీఐ సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించి బాధిత కుటుంబానికి భరోసా కల్పించింది.

By అంజి  Published on  18 Jan 2024 10:43 AM GMT
TSRTC, conductor family, road accident, Telangana

రోడ్డు ప్రమాదంలో కండక్టర్‌ మృతి.. బాధిత కుటుంబానికి అండగా ఆర్టీసీ 

రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి టీఎస్‌ఆర్టీసీ అండగా నిలిచింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించి బాధిత కుటుంబానికి భరోసా కల్పించింది. హైదరాబాద్ బస్ భవన్ లో గురువారం రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన తాండూరు డిపో కండక్ట‌ర్ లక్ష్మణ్‌ కుటుంబానికి రూ.40 లక్షల విలువైన చెక్కును యూబీఐ అధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ అంద‌జేశారు. తాండూరు డిపోనకు చెందిన కండక్టర్‌ లక్ష్మణ్‌ రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. శిక్షణకు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్తుండగా ద్విచక్రవాహనం ఢీకొని ఆయన మృతి చెందారు. హైదరాబాద్ శివారు హకీంపేటలో గత ఏడాది జూన్ 22న జరిగిందీ ప్రమాదం.

ఈ ఆప‌ద స‌మ‌యంలో యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాన్ని ఆదుకుంది. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్ర‌మాద బీమా సౌక‌ర్యం ఉంది. ప్ర‌మాదాలు జ‌రిగిన స‌మ‌యంలో సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేత‌నం ప్ర‌కారం) క‌నీసం రూ.40ల‌క్ష‌లు వరకు యూబీఐ అందజేస్తోంది. రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించడంపై టీఎస్ఆర్టీసీ, యూబీఐకి కండ‌క్ట‌ర్ లక్ష్మణ్‌ భార్య జ్యోతి, కుమారుడు అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఈడీ ఎస్‌.కృష్ణకాంత్‌, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, సీపీఎం ఉషాదేవి, యూబీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, తాండూరు బ్రాంచీ మేనేజర్ అరుణ్ కుమార్, రంగారెడ్డి డిప్యూటీ ఆర్ఎం రాజు, తాండూరు డీఎం సమత, తదితరులు పాల్గొన్నారు.

Next Story