డేటా విశ్లేషణకు ఐఎస్బీతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం
TSRTC contract with ISB for data analysis. డేటా విశ్లేషణకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)తో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్
By Medi Samrat
డేటా విశ్లేషణకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)తో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అవగాహన ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లోని ఐఎస్బీ క్యాంపస్లో మంగళవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐఎస్బీ, డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల సమక్షంలో.. ఐఎస్బీ డేటా సైన్స్ విభాగ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనీష్ గంగ్వార్, టీఎస్ఆర్టీసీ ఐటీ చీఫ్ ఇంజనీర్ రాజశేఖర్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
రూట్ల క్రమబద్దీకరణ, లాభాల గరిష్ఠీకరణపై డేటా విశ్లేషణ కోసం ఐఎస్బీతో చేసుకున్న ఈ అవగాహన ఒప్పందం దోహదం చేస్తుందని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. త్వరలోనే ఇది ఇతర ప్రజా రవాణా సంస్థలకు రోల్ మోడల్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీ 10 వేల బస్సులతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతోందని గుర్తు చేశారు. ప్రతి రోజు సగటున 35 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారని చెప్పారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంతో పాటు ప్రజల సురక్షిత ప్రయాణానికి ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాల్సిన అవసరముందని అన్నారు.
ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన, మెరుగైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల అన్నారు. టీఎస్ఆర్టీసీ రవాణా వ్యవస్థని పటిష్ఠపరచడానికి డేటా విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఈడీ(ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్, సీటీఎం జీవన్ ప్రసాద్, సీఎస్వో విప్లవ్, కన్సల్టెంట్లు ముకుంద్, దీప, ఐఎస్బీ నుంచి మధు విశ్వనాథన్, సుధీర్ ఓలేటి, కుమార గురు, సందీప్, తదితరులు పాల్గొన్నారు.