టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుద‌ల‌

టీఎస్‌పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్‌, సభ్యుల నియామకానికి ప్ర‌భుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

By Medi Samrat  Published on  12 Jan 2024 3:25 PM GMT
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుద‌ల‌

టీఎస్‌పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్‌, సభ్యుల నియామకానికి ప్ర‌భుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. ఆ దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు secy-ser-gad@telangana.gov.in మెయిల్‌కు పంపించవచ్చని పేర్కొంది. ఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను ఈ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది.

ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి, సభ్యులు సత్యనారాయణ, రవీందర్‌రెడ్డి, లింగారెడ్డిల రాజీనామాలను ఆమోదించిన నేప‌థ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్త‌ ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన త‌రువాత డిసెంబ‌ర్ 11న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లిసిన‌ జ‌నార్ద‌న్ రెడ్డి త‌ర్వాత ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ త‌రువాత మ‌రో ముగ్గురు క‌మిష‌న్ స‌భ్యులు రాజీనామాలు స‌మ‌ర్పించారు. వీరి రాజీనామాల‌ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై జ‌న‌వ‌రి 10న ఆమోదించారు.

Next Story