హైదరాబాద్‌లో ఉచిత వైఫై సౌకర్యం.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్

TS government launches 3000 public wi fi hotspots in hyderabad.హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ఇది శుభ‌వార్తే. ఇక‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2021 5:50 AM GMT
హైదరాబాద్‌లో ఉచిత వైఫై సౌకర్యం.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ఇది శుభ‌వార్తే. ఇక‌పై న‌గ‌రంలో మ‌నం బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడు వైఫై లేదు అని బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. న‌గ‌రంలో ఉచిత వైఫై హాట్‌స్పాట్లలో ఉచితంగా ఇంటర్నెట్ పొందొచ్చు. ప్ర‌జ‌లు అధికంగా ఉండే మూడు వేల ప్ర‌దేశాల్లో ప్రభుత్వ సహకారంతో యాక్ట్ ఫైబర్ నెట్ ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. మంత్రి కేటీఆర్ బుధ‌వారం సాయంత్రం లాంఛనంగా దీనిని ప్రారంభించారు.బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ ఈ సేవలను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఐటీశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్‌, న‌గ‌ర మేయ‌ర్ గద్వాల్ విజ‌య‌ల‌క్ష్మీ, మెట్రో సీఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, యాక్ట్ ఫైబ‌ర్ నెట్ సీఈవో బాల మ‌ల్లాది త‌దిత‌రులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ వై-ఫై ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోని వారితో వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడారు. తానన్న ఒకే ఒక్క మాటతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారంటూ యాక్ట్ ఫైబర్ నెట్ సీఈవో బాల మల్లాదికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఇదే అతిపెద్ద పబ్లిక్ వై-ఫై అని పేర్కొన్నారు. బాల మల్లాది మాట్లాడుతూ.. నగరంలో ఏర్పాటు చేసిన ఓపెన్ వై-ఫైని నెలకు 3 లక్షల మంది వరకు వినియోగించుకుంటున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మ‌రో 500 వైపై హాట్‌స్పాట్ల‌ను ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నట్లు ఆయ‌న చెప్పారు.

హైదరాబాద్‌లో ఉన్న 47 మెట్రో రైల్ స్టేషన్లతో పాటు ప్రభుత్వ స్కూళ్లు, బస్తీ దవాఖానాలు, హాస్పిటల్స్, పబ్లిక్ లైబ్రెరీల్లో ఉచిత వైఫై హాట్‌స్పాట్స్ ఉన్నాయి పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్స్ ద్వారా యూజర్లు ఉచితంగా ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు. రోజూ 45 నిమిషాల పాటు ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. 25ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. గరిష్టంగా 1జీబీ డేటా వాడుకోవచ్చు.

Next Story