జగిత్యాల జిల్లాలో విషాదం

Tragedy In Jagityal District. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో సంక్రాతి పండుగ రోజు విషాదం చోటు

By -  Medi Samrat
Published on : 14 Jan 2022 7:05 PM IST

జగిత్యాల జిల్లాలో విషాదం

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో సంక్రాతి పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకుందామని వచ్చిన మహిళను మృత్యువు కబళించింది. కోతి దాడి నుంచి తప్పించుకోబోయి ఆమె ప్రాణాలే పోయాయి. ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన నారంభట్ల రాజేశ్వరి(50) అనే మహిళ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. సంక్రాంతి పండుగ సెలవుల కోసం స్వగ్రామమైన ధర్మపురికి రెండు రోజుల క్రితం వచ్చింది.

ఆ మహిళ నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ పైకి వెళ్లింది. అయితే అక్కడే ఉన్న ఓ కోతి ఆమెపై దాడి చేయడంతో భయాందోళనకు గురైంది. అక్కడ నుంచి కిందకు పరుగెత్తే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్‌ పై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ షాకింగ్ ఘటనతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.


Next Story