సంక్షేమం కనిపెట్టిందే కాంగ్రెస్‌.. కచ్చితంగా అధికారంలోకి వస్తాం: రేవంత్‌ రెడ్డి

లెక్కలు వేసుకోనో, కేసీఆర్‌ దీక్షతోనే.. కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు.

By అంజి  Published on  3 Nov 2023 7:25 AM GMT
TPCC, Revanth Reddy, Telangana Polls, Congress, KCR

సంక్షేమం కనిపెట్టిందే కాంగ్రెస్‌.. కచ్చితంగా అధికారంలోకి వస్తాం: రేవంత్‌ రెడ్డి

లెక్కలు వేసుకోనో, కేసీఆర్‌ దీక్షతోనే.. కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ బతకదని తెలిసి కూడా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని పేర్కొన్నారు. ఇచ్చిన మాటపై నిలబడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. వందమంది కేసీఆర్‌లు చనిపోయినా తెలంగాణ రాకపోవునని, సోనియా వల్లే తెలంగాణ కల సాకారమైందన్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్‌ శ్రీమంతుల తెలంగాణ తల్లిని చూపించారు తప్ప.. పేదల తెలంగాణ తల్లిని చూపించలేదన్నారు. తెలంగాణ ప్రజలు సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్నారని, తెలంగాణ సమాన అభివృద్ధిని కోరుకుంటోందని, అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. తెలంగాణ అధికారిక చిహ్నంలో రాచరిక పోకడలు కనిపిస్తున్నాయని, అధికారిక చిహ్నంలో పోరాటల స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదని అన్నారు.

కేసీఆర్‌ది రాచరికపు ఆలోచన రేవంత్‌ దుయ్యబట్టారు. దళిత ముఖ్యమంత్రి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, నియోజకవర్గానికి 100 పడకల ఆస్పత్రి, నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, జర్నలిస్టులకు ఇళ్లు వంటి హామీలను ఇచ్చినా సీఎం కేసీఆర్‌ వాటిని నెరవేర్చలేదన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని కేసీఆర్‌ హరించారని రేవంత్‌ ఆక్షేపించారు. ప్రజల హక్కులను కేసీఆర్‌ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగడంపై మంత్రి హరీష్‌ రావు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని రేవంత్‌ రెడ్డి అన్నారు. బ్యారేజ్‌ కుంగడం పెద్ద విషయం కాదన్నట్టు మాట్లాడటం దారుణమన్నారు. కేసీఆర్‌ కుటుంబం కోసమే సాగునీటి రంగ నిపుణులు అన్నట్టు మాట్లాడుతున్నారని, బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో బ్యారేజీ నిర్మించారని అన్నారు.

రాష్ట్రంలో అందరినీ వర్గ శత్రువుల్లా కేసీఆర్ చూస్తున్నారని రేవంత్‌ ఫైర్‌ అయ్యారు. ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రజలు తమ బాధలు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో పాలకులు ప్రజలకు సచివాలయంలో అందుబాటులో ఉండేవారని, కానీ ఇవాళ ప్రతిపక్ష నేతలకు, జర్నలిస్టులకు సచివాలయంలోకి ప్రవేశం లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్ రేవంత్‌ అభిప్రాయపడ్డారు. మార్పు జరగకుండానే ఉద్యమకారుల జీవితాలు తారుమారయ్యాయన్నారు. ఆత్మహత్య చేసుకున్న యువతులపై ప్రభుత్వమే తప్పుడు ప్రకటనలు చేస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ పాపాల పుట్ట పగిలిందని.. మేడిగడ్డ కుంగిందని రేవంత్‌ సెటైర్‌ వేశారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీనీ ఈ పదేళ్లలో నెరవేర్చలేదన్నారు. ప్రజలని మోసం చేసిన కేసీఆర్ లాంటి మోసగాళ్లకు తెలంగాణలో స్థానం లేదన్నారు.

పదేళ్లలో ఎవరి భవిష్యత్ బాగుపడింది.. ఎక్కడ బంగారు తెలంగాణ? అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవద్దని ప్రచారం చేశారు.. అంటే పరోక్షంగా కేసీఆర్ కోరుకుంది మోదీ గెలుపేనా అని ప్రశ్నించారు. 2050 వరకు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళుతున్నామని రేవంత్‌ అన్నారు. కేసీఆర్ గురించి తెలంగాణలోని కేసీఆర్ బాధితులే చెబుతారు... జర్నలిస్టులు కూడా కేసీఆర్ బాధితులే అని రేవంత్‌ అన్నారు. విధివిధానాలపై ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళదామన్నారు. చుక్క మందు, డబ్బు లేకుండా ఎన్నికల్లోకి వెళదామన్నారు. పిల్లర్లు కుంగాయి కాబట్టే మేడిగడ్డ బ్యారేజీ జాయింట్ లో గ్యాప్ పెరిగిందన్న రేవంత్‌.. ఒక మీటరు కుంగింది అని అధికారులే చెబుతున్నారని అన్నారు. తప్పించుకోవడానికే కేటీఆర్ ఏవేవో మాట్లాడుతున్నారని, తాము తప్పు చెబుతున్నామంటే.. అఖిలపక్షాన్ని తీసుకెళదామన్నారు.

''ప్రాజెక్టు కుంగిందో లేదో వాళ్లే చెబుతారు. బీఆరెస్ నేతలవి లాజిక్ లేని వాదనలు. సంక్షేమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. పెన్షన్లు, పక్కా ఇళ్లు లాంటి పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్. కేసీఆర్ తాను చేసింది చెప్పుకోలేక కాంగ్రెస్ నపై ఆరోపణలు చేస్తున్నారు'' అని రేవంత్‌ అన్నారు. కేసీఆర్ వాదనల్లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడలేదన్నారు. మైనారిటీలను అన్ని రకాలుగా సంక్షేమంలో భాగస్వాములను చేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని రేవంత్‌ తెలిపారు. పేదలకు విద్యను చేరువ చేసింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.

కాంగ్రెస్ ఏర్పాటు చేసిన స్కూళ్లలో 6,540 సింగిల్ టీచర్ స్కూళ్లను కేసీఆర్ హయాంలో మూసేశారని రేవంత్‌ ఆరోపించారు. రైతులకు ఎకరానికి ఏటా 10వేలు ఇస్తామని 2014లోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని చెప్పారు. దాన్నే కాపీ కొట్టి కేసీఆర్ రైతు బంధు పేరుతో ఇస్తున్నారని రేవంత్‌ చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకే పక్క రాష్ట్రాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. కాంగ్రెస్ దశాబ్ద పాలన-బీఆరెస్ దశాబ్ద పాలనపై చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు.

''మా పార్టీ నుంచి నేను, సీఎల్పీ భట్టి వస్తాం.. మిగతా పార్టీల నుంచి ఇద్దరు చొప్పున రండి.. చర్చ పెడితే పాలకు పాలు,నీళ్లకు నీళ్లు బయట పడతాయి. ఓటుకు వెల కట్టే సంస్కృతి తెచ్చిందే కేసీఆర్. హైదరాబాద్ లో ఐటీ కి పునాది వేసింది కాంగ్రెస్. హైదరాబాద్ ను పెట్టుబడి నగరంగా తీర్చిదిద్దుతాం. గంగా నదిలా మూసీని ప్రక్షాళన చేస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ ను అద్భుతంగా అభివృద్ధి చేసే ప్రణాళిక మా దగ్గర ఉంది. అర్బన్, రూరల్ హైదరాబాద్ కు కనెక్టివిటీ ఇవ్వనున్నాం. రాచకొండ గుట్టలను తెలంగాణ ఊటీలా అభివృద్ధి చేస్తాం.. హైదరాబాద్ ను ప్రపంచానికే తలమానికంగా మారుస్తాం'' అని రేవంత్‌ హామీలు ఇచ్చారు.

కమ్యూనిస్టులతో పొత్తుల అంశం ఇంకా ముగియలేదన్న రేవంత్‌.. పొత్తు అంశంపై తమ సమన్వయ కమిటీ చర్చలు జరుపుతోందని అన్నారు. ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వమే పెద్ద దళారీగా మారిందని రేవంత్‌ ఆరోపించారు. ధరణిలో అత్యంత పెద్ద దళారులు కేసీఆర్ కిటుంబ సభ్యులేనని రేవంత్‌ అన్నారు. తాము ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్ కు ఎందుకంత దుఃఖం? అని రేవంత్‌ ప్రశ్నించారు.

Next Story