ఈటెల, హరీష్ కలిశారు.. కేసీఆర్తో సంభాషించారు : టీపీసీసీ చీఫ్ సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్ మునిగిపోయిన నావ అని.. నావలో ఉన్న వస్తువులు( డబ్బుల) కోసం కేసీఆర్ కుటుంబంలో కొట్లాట జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat
బీఆర్ఎస్ మునిగిపోయిన నావ అని.. నావలో ఉన్న వస్తువులు( డబ్బుల) కోసం కేసీఆర్ కుటుంబంలో కొట్లాట జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 8 సీట్లు ఉన్న బీజేపీతో కలిస్తే బీఆర్ఎస్ 8 స్థానాలకు పరిమితమవుతుందన్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై సమాధానం చెప్పే దమ్ముందా కిషన్ రెడ్డి.? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ముందుగా వారి ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలకి సమాధానం చెప్పాలన్నారు.
కవిత, రాజా సింగ్ వ్యాఖ్యల్ని పోల్చి చూస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అన్నారు. కేసీఆర్ కుటుంబంలో వాటాల కోసం పంచాయితీ మొదలైందన్నారు. నోటీసులు రాగానే కేసీఆర్, ఈటెలకు పాత బంధం మళ్ళీ చిగురించిందన్నారు. కాళేశ్వరం విషయంలో నోటీసులు రాగానే.. శామీర్ పేటలోని ఓ ఫాం హౌస్ లో హరీష్ రావుతో ఈటల రాజేందర్ సమావేశం అయ్యారు.. హరీష్ రావుతో కలిసి ఈటెల..కేసీఆర్తో ఫోన్లో సంభాషించారని ఆరోపించారు.
రాజా సింగ్, కవిత వ్యాఖ్యలతో ముడుపులు, బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం గుట్టు వీడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మైత్రి గురించి కవిత చెప్పకనే చెబుతున్నారు.. కేసీఆర్ - కిషన్ రెడ్డి కలయిక వల్లే బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని బీజేపీ ఎమ్మెల్యే పరోక్షంగా చెబుతున్నారు. రాజా సింగ్ లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం బీజేపీ నేతల చేతగానితనం అన్నారు. కవిత లెటర్ లీక్ వెనక ఆమె ప్రమేయం లేదా కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండి ఉండవచ్చన్నారు.
పాక్పై యుద్ధం తీరు తెన్నుల గురించి తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బీజేపీ నాయకులు, మోదీ సరైన రీతిలో యుద్ధం చేయలేక ట్రంప్ ప్రలోభానికి గురై వెనకడుగు వేశారన్నారు. బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అవాకులు చెవాకులు పేలుతున్నారు.. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. సైనికులకు బాసటగా రాహుల్ గాంధీ నిలిస్తే విమర్శలు చేయడం బీజేపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. దేశ ప్రజలు అడుగుతున్నారు.. పాక్ పై యుద్ధంలో సాధించింది ఏమిటి.? కోల్పోయింది ఏమిటి?. అపర కాళీమాత ఇందిరా గాంధీ అని వాజ్ పాయ్ కొనియాడిన విషయం కిషన్ రెడ్డి తెల్వకపోవడం విడ్డూరం అన్నారు. ఇందిరా గాంధీ హయాంలో వందల సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి.. సైనిక రహస్యాల్ని రాజకీయ స్వార్థం కోసం బీజేపీ వాడుకొని లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందన్నారు.