హరీష్ రావుతో ఎక్కడైనా చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు రావాలని.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన మాట వాస్తవం కాదా.? అని ప్రశ్నించారు. కంచె చేను మేసినట్లు ప్రభుత్వ ఆస్తులు నాశనం చేశారని ఆరోపించారు. హరీష్ – ఈటల భేటీపై పక్కా సమాచారం మా వద్ద ఉందన్నారు.
తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అన్నారు. ₹1.20 లక్షల కోట్లు ఖర్చుపెట్టిన కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికి నీరొచ్చిందా? అని ప్రశ్నించిన ఆయన.. “కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది” అని ఎద్దేవా చేశారు. హరీష్ రావుకు బీఫాం వస్తుందా? “నాలుగు ముక్కలాట”లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తావ్ హరీష్? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్–బీజేపీ పొత్తుపై కవిత వ్యాఖ్యలకు ముందు సమాధానం చెప్పండని నిలదీశారు.