బీసీలలో ఐక్యత లోపించింది.. పార్టీలకు అతీతంగా ఏకం కావాలి : టీపీసీసీ చీఫ్
బీసీలలో ఐక్యత లోపించిందని.. బీసీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat
బీసీలలో ఐక్యత లోపించిందని.. బీసీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీలకు అతీతంగా బీసీలు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. నాంపల్లిలో జరిగిన ఓబీసీ పోరుబాట పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తీసుకున్న కుల గణన నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంగా అభివర్ణించారు.
కుల గణనతో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ దేశంలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోగలిగారన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల్లో నుంచి పుట్టిందే కుల సర్వే అన్నారు. చాలా వరకు బీసీలను ఓటు సాధనాలుగానే చూశారని.. మా వాటా మాకు కావాలి అనే స్థాయికి బీసీలు ఎదిగారు.. సమాజంలో ఎవరి వాట వారికే సిద్ధాంతానికి కట్టుబడి పారదర్శకంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే నిర్వహించిందన్నారు.
కుల సర్వేను వ్యతిరేకించిన కేంద్రంలోని బీజేపీ సైతం జనగణనతో పాటు కుల గణన చేపడతామని ప్రకటించింది. ఖర్గే,రాహుల్ గాంధీ సమక్షంలో కుల సర్వే పై దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 450 పైగా కాంగ్రెస్ ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లకు చట్ట బద్దత కల్పించామన్నారు.
ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆశయం మేరకు కుల సర్వేను శాస్త్రీయ బద్దంగా నిర్వహించారు. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేబినెట్ విస్తరణ జరిగిందని.. 68 శాతం మేర పీసీసీ కార్యవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు కల్పించామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుతో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కల్పించగలదని నిరూపించుకుందన్నారు. బీసీ బిల్లుకు చట్ట రూపం కల్పించి రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్చేందుకు బీసీలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కులాలకు అతీతంగా బీసీ బిల్లు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.