మూడో విడత ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది : టీపీసీసీ చీఫ్
పంచాయతీ ఎన్నికలు–2025 మూడో విడత ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
By - Medi Samrat |
పంచాయతీ ఎన్నికలు–2025 మూడో విడత ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. పల్లెలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఘన విజయం సాధించడం గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై వ్యక్తం చేసిన విశ్వాసానికి స్పష్టమైన ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికల మూడో విడత ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టులా మారాయని, తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పుకు ఇవి సంకేతమని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఈ విజయం వెనుక సమన్వయంతో కూడిన బలమైన ప్రచార వ్యూహాలే ప్రధాన కారణమని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను ఒకే వేదికపై సమన్వయం చేస్తూ గ్రామ స్థాయి వరకు విస్తరించిన ప్రచారం పార్టీకి అనుకూలంగా మారిందని తెలిపారు.
ప్రజల ఆశయాలకు అద్దం పట్టే విధంగా వచ్చిన ఈ తీర్పు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల గ్రామీణ ప్రజల్లో ఏర్పడిన సంతృప్తిని మరోసారి రుజువు చేసిందని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండు సంవత్సరాలుగా అమలవుతున్న ప్రజాపాలన, సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్న తీరు ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయపరిచిన ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలిగించిందని చెప్పారు.
గ్రామస్థాయి సమస్యలను గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు అనుకూలంగా మారిందని మహేష్ గౌడ్ విశ్లేషించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు గ్రామీణ ఓటర్లలో కాంగ్రెస్పై విశ్వాసాన్ని మరింత పెంచాయని తెలిపారు. ప్రజలను నేరుగా కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధానం పార్టీ బలాన్ని పటిష్టం చేస్తోందని పేర్కొన్నారు. “సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి” అనే నినాదానికి ప్రజలు పట్టం కట్టారని, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఘన విజయం దీనికి స్పష్టమైన ప్రతీక అని మహేష్ గౌడ్ అన్నారు.
మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలు, రైతులు, యువత పెద్ద సంఖ్యలో కాంగ్రెస్కు మద్దతు తెలపడం గ్రామ పాలనా వ్యవస్థలో కొత్త దిశను సూచిస్తోందని, పంచాయతీ ఎన్నికల్లో సామాజిక న్యాయం స్పష్టంగా ప్రతిఫలించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
గ్రామీణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్న తీరు తెలంగాణలో నూతన రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతోందని టీపీసీసీ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఈ విజయం పార్టీపై మరింత బాధ్యతను పెంచిందని, గ్రామీణ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి ప్రాధాన్యత కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
సర్పంచ్ ఎన్నికల తొలి, రెండో, మూడో విడతల ఫలితాలు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై గ్రామీణ స్థాయిలో ఏర్పడిన అనుకూల వాతావరణానికి అద్దం పడుతున్నాయని, ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.