సెన్సిటివ్ అంశాలు అలా ఎలా మాట్లాడతారు? ఓ మంత్రిపై టీపీసీసీ చీఫ్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు.
By Knakam Karthik
సెన్సిటివ్ అంశాలు అలా ఎలా మాట్లాడతారు? ఓ మంత్రిపై టీపీసీసీ చీఫ్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. పంచాయతీ రాజ్ శాఖలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకోవడంపై టీపీసీసీ ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల అంశంపై మంత్రి పొంగులేటి చేసిన ప్రకటన పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. కీలకమైన అంశాలను మంత్రివర్గంలో చర్చించకుండా నేరుగా మీడియాతో మాట్లాడటం సరైన పద్ధతి కాదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీలో కూడా చర్చించకుండా ఇటువంటి ప్రకటనలు చేయడం తగదని ఆయన స్పష్టం చేశారు.
ఒక మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశంపై మరో మంత్రి మాట్లాడటాన్ని మహేశ్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఇది సరైన విధానం కాదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా న్యాయస్థానాల పరిధిలో ఉన్న సున్నితమైన అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్పందించాలని సూచించారు. మంత్రులు తమ శాఖల పరిధిలోని అంశాలపైనే దృష్టి సారించాలని, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు.
ముందుగా పార్టీలో గానీ, కేబినెట్లో గానీ చర్చించకుండా బహిరంగ ప్రకటనలు చేయడం వల్ల అనవసరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలు పార్టీకి, ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో మంత్రులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని ఆయన కోరారు. సెన్సిటివ్ అంశాలను, కోర్టు పరిధిలో అంశాలను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని టీపీసీసీ చీఫ్ సూచించారు.