ఎకరాకు రూ.12,000.. కొత్తగా దరఖాస్తుకు నేడు ఆఖరు

కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన అన్నదాతలకు రైతు భరోసా ప్రయోజనాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

By అంజి
Published on : 20 Jun 2025 6:33 AM IST

new applications, Rythu Bharosa Scheme, Telangana, Farmers

ఎకరాకు రూ.12,000.. కొత్తగా దరఖాస్తుకు నేడు ఆఖరు

హైదరాబాద్‌: కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన అన్నదాతలకు రైతు భరోసా ప్రయోజనాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జూన్‌ 5వ తేదీ వరకు పాస్‌బుక్‌ పొందిన రైతులందరికీ ఈ సీజన్‌లో రైత భరోసా నిధులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకం పొందిన అన్నదాతలు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20ని చివరి తేదీగా నిర్ణయించింది. ఈ గడువు నేటితో ముగియనుంది.

అందుకే అర్హులై, ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని అన్నదాతలు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రైతు భరోసాకు తెలంగాణకు చెందిన రైతు అర్హుడు. అలాగే కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. దరఖాస్తుదారుడి పేరు మీదే భూమి ఉండాలి. రైతుకు ఉన్న భూమి వ్యవసాయ భూమి అయి ఉండాలి. అలాగే భారతి పోర్టల్‌లో నమోదై ఉండాలి. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులేనని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దీని కోసం మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారి ఆఫీసుకు వెళ్లాలి. అక్కడ రైతు భరోసా అప్లికేసన్‌ తీసుకోవాలి. ఈ దరఖాస్తులు ప్రజాపాలనా కేంద్రాల్లో కూడా దొరుకుతాయి. లేదంటే ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఫామ్‌లో ఇచ్చిన కాలమ్స్‌లో రైతుకు సంబంధించిన వివరాలను నింపాలి. ఈ ఫామ్‌తో పాటు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలను జత చేసి, ఏఈవో లేదా క్లస్టర్‌ అధికారికి ఇవ్వాలి. ఆ వివరాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం అర్హులు అయితే.. రైతు భరోసా పథకం కోసం జిల్లా స్థాయి అధికారులకు సిఫారసు చేస్తున్నారు. వీరికి త్వరలో నిధులు జమ అవుతాయి.

Next Story