పాడిపశువుల్లోనూ సరోగసీ సక్సెస్..!

Three Calfs born in Surrogacy Method in Telangana. తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ ‘సరోగసీ’ విధానాన్ని పాడిపశువుల్లోనూ వి

By Medi Samrat  Published on  27 July 2022 3:03 PM GMT
పాడిపశువుల్లోనూ సరోగసీ సక్సెస్..!

తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ 'సరోగసీ' విధానాన్ని పాడిపశువుల్లోనూ విజయవంతంగా అమలు చేసి రికార్డులకెక్కింది. జగిత్యాల జిల్లాలో ఈ విధానంలో మూడు లేగదూడలు జన్మించాయి. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (LDA), కోరుట్ల పశువైద్య కళాశాల సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరోగసీ విధానం ద్వారా సాహివాల్ దేశీయ జాతి గిత్త నుంచి వీర్యాన్ని సేకరించి ఫలదీకరణం చేయించి ఆ ఎంబ్రియోలను జెర్సీ ఆవు గర్భంలో ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం తెలంగాణకు రూ. 5.83 కోట్లు కేటాయించింది.

జగిత్యాల జిల్లా కోరుట్ల పశువైద్య కళాశాలలో ఈ ప్రయోగాన్ని చేపట్టిన అధికారులు మొత్తం 19 ఎంబ్రియోలను ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. అనంతరం వాటిని ఆవుల గర్భంలో ప్రవేశపెట్టారు. వీటిలో ఒక పెయ్య దూడ, రెండు మగదూడలు పుట్టినట్టు ఎల్‌డీఏ సీఈవో డాక్టర్ మంజువాణి మంజువాణి తెలిపారు. సరోగసీ విధానంలో రాష్ట్రంలో దూడలు జన్మించడం ఇదే తొలిసారని, రైతుల ఆర్థికాభివృద్ధి, పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా పెయ్య దూడలు మాత్రమే పుట్టేలా పరిశోధనలు చేస్తున్నట్టు చెప్పారు. ఇదే విధానంలో ఒక ఎంబ్రియోను పాడిపశువుల గర్భంలో ప్రవేశపెట్టేందుకు ప్రైవేటు సంస్థలు రూ. 16,500 వసూలు చేస్తున్నాయని, తాము మాత్రం పూర్తి ఉచితంగానే చేస్తున్నట్టు చెప్పారు.










Next Story