తెలంగాణ ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల రాయితీ గడువును ప్రభుత్వం జనవరి 31వ తేదీ వరకు పొడిగించింది. తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల 9 లక్షల పెండింగ్ చలాన్లు ఉండగా నేటి వరకు దాదాపు 1 కోటి 7 లక్షల మంది రాయితీతో కూడిన చలాన్లకు సంబంధించిన చెల్లింపులు జరిపారు. ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది. తొలుత గత డిసెంబర్ 26వ తేదీ నుంచి నేటి వరకు పెండింగ్ చలాన్ల రాయితీకి అవకాశం కల్పించారు. అయితే ఇప్పటి వరకు దాదాపు సగం పెండింగ్ చలాన్లు కూడా రాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం గడువును మరో ఇరవై రోజులు పొడిగించింది.
సాంకేతిక సమస్యలతో చెల్లింపుల్లో ఆలస్యమవుతుందని పోలీసులు తెలిపారు. అందుకే పెండింగ్ చలాన్ల రాయితీ గడువును పొడిగించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80శాతం రాయితీ.. ఆర్టీసీ బస్సులకు 90శాతం, ఇతర వాహనాలకు 60శాతం రాయితీ రాయితీని ప్రకటించారు. గతేడాది రాయితీ ఇవ్వగా.. 45 రోజుల్లోనే ఏకంగా రూ.300కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి జనం పెద్దగా చెల్లింపులకు ముందుకు రావడం లేదు.