హైదరాబాద్: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
ఇప్పటివరకు ఉన్న అవార్డు విభాగాలకు తోడు ఈసారి కొత్త విభాగాలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సామాజిక స్పృహను ప్రతిబింబించే చిత్రాలకు ‘ఉత్తమ సామాజిక సందేశ చిత్రం’ అవార్డు, ప్రత్యేక విభాగంలో డా. సి. నారాయణరెడ్డి అవార్డులను అందజేయనున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సినిమారంగానికి పెద్దపేట వేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అర్హులైన నిర్మాతలు మరియు ఇతర దరఖాస్తుదారులు అవార్డులకు సంబంధించిన దరఖాస్తు పత్రాలు, మార్గదర్శకాలను జనవరి 31, 2026 వరకు పొందవచ్చని, ఎంట్రీల సమర్పణకు ఫిబ్రవరి 3, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలను పాటిస్తూ నిర్ణీత గడువులోపే దరఖాస్తులను సమర్పించాలని అర్హులైన నిర్మాతలను ప్రభుత్వం తరుపున మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.