కళాకారులను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ : ఎమ్మెల్సీ కవిత

Telangana Sahitya Sabhalu started under the chairmanship of MLC Kavitha. భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన తెలంగాణ సాహిత్య సభలు ప్రారంభమయ్యాయి.

By Medi Samrat  Published on  21 Jun 2023 9:36 AM GMT
కళాకారులను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ : ఎమ్మెల్సీ కవిత

భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన తెలంగాణ సాహిత్య సభలు ప్రారంభమయ్యాయి. ఈ స‌భ‌ల‌కు అతిధులుగా డా.నందిని సిద్దారెడ్డి, డా. గోరేటి వెంకన్న, డా. తిరునగరి దేవకిదేవి, డా. గోగు శ్యామల, తిగుళ్ల కృష్ణమూర్తి, డా. ఏనుగు నరసింహ రెడ్డిల‌తో పాటు పలువురు కవులు పాల్గొన్నారు.

భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ఎంత ముఖ్యమో.. మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలని జాగృతి ఉద్యమం చేసిందని క‌విత‌ తెలిపారు. ప్రతి సంవత్సరం సాహిత్య సభలు జరపాలని ఈ కార్యక్రమం రూపొందించామ‌న్నారు. రెండు రోజుల పాటు ఈ సాహిత్య సభలు జరుగుతాయని.. అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చలు జరుగుతాయని వెల్ల‌డించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించుకున్నాము. అందరిని భాగస్వామ్యం చేస్తూ ఈ సాహిత్య సభలు విజయవంతం చేసుకుందామ‌ని పిలుపునిచ్చారు. ఎవరి భాష వారికుంటది.. ఇదే మాట్లాడాలి అని అంటే.. తీవ్రంగా వ్యతిరేకిస్తాం.. రూల్స్ బ్రేక్ చేస్తామ‌ని క‌విత అన్నారు. తెలంగాణ జాగృతి దేశంలో ఉన్న ప్రజలను జాగృతం చేసేందుకు భారత జాగృతిగా రూపుదిద్దుకుందన్నారు. 530కు పైగా కళాకారులకు జీతం ఇస్తూ వారిని గౌరవిస్తూన్నామని తెలిపారు. కళాకారులను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.

డా.నందిని సిధారెడ్డి

భారత జాగృతి ఈ సాహిత్య సభలు నిర్వహించడం చాలా సంతోషంగా, ఉద్వేగంగా ఉంద‌ని నందిని సిధారెడ్డి అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో భారత జాగృతి, ఏమ్మెల్సీ కవిత కృషి చేస్తున్నారు ఎంతో అభినందనీయం అని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరపాలని.. అప్పటి సీఎం దగ్గరికి వెళితే బతుకమ్మ కూడా పండుగేనా అని అన్నారు. బతుకమ్మ కూడా పండుగేనా అని ఆనాటి ఆంధ్రపాలకులు హేళన చేశారు. అలాంటి దశలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మను ఎత్తుకొని.. బతుకమ్మ పండుగ గుర్తింపుకు విశేష కృషి చేసారు. బతుకమ్మకు భారతదేశ వ్యాప్తంగా ఖ్యాతి రావాలని ఎమ్మెల్సీ కవిత కృషి చేసారు. మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో బతుకమ్మ పండుగలు నిర్వహించారు. ఈ రోజు బతుకమ్మ కు ఎంతో ఖ్యాతి రావడం ఎమ్మెల్సీ కవిత కృషి వల్లనేన‌న్నారు.

ఈ తొమ్మిదేళ్లలో ఉద్యమ ఫలితాలు మనం అనుభవిస్తున్నామ‌ని.. నేడు తెలంగాణ భాష లేకపోతే సినిమాలు ఆడే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ భాషతో తీసే సినిమాలు ఘనవిజయం సాధిస్తున్నాయన్నారు. అనువాద సినిమాల్లో కూడా తెలంగాణ భాష మాట్లాడుతున్నారని అన్నారు. ఆంధ్రవాళ్ళు కూడా తెలంగాణ భాష నేర్చుకొని వ్యాపారం చేస్తున్నారు.. ఇదంతా తెలంగాణ ఉద్యమం సాధించిన ఘనత అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ తెలుగు మహాసభల్లో పద్యాలు, కవితలు చెబుతుంటే ఆనాడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు ఎప్పుడు వస్తారో అని ఆంధ్ర కవులు నాతో పంచుకున్నారు. తెలంగాణను జాగృతం చేసినట్టు భారతదేశాన్ని కూడా జాగృతి పర్చాల్సిన భాద్యత ఎమ్మెల్సీ కవిత మీద ఉందని అన్నారు. భాష మీద పెత్తనం మొదలైంది. హిందీని రుద్దాలని చూస్తున్నారు. హిందీ అధికార భాషగా గుర్తించాలని యూపీ ఎంపీ అంటున్నారు. ఇది అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయం.. హిందీని మనమీద రుద్దాలని చుస్తే అందరం వ్యతిరేకించాలి. భారతదేశములో అన్ని భాషలు బతకాలి, అన్ని సంస్కృతులు వర్ధిల్లాలని అన్నారు.

డా.తిరునగరి దేవకిదేవి

బతుకమ్మ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏమ్మెల్సీ కవిత అని తిరునగరి దేవకిదేవి అన్నారు. నాడు మన భాషను ఎలా ఈసడిoచుకున్నారో.. బతుకమ్మ పండుగను కూడా అంతే హేళన చేశారని అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి మన భాష సంస్కృతి పరిరక్షణకు ఎలా పనిచేసారో.. జాగృతి కూడా మన సంస్కృతి కాపాడటం కోసం పనిచేస్తుంద‌ని అన్నారు. తెలంగాణ వచ్చాక.. ఇక్కడ వచ్చిన సాహిత్యం దేశములో ఎక్కడా రాలేదని.. మన భాష మన మాండలికాన్ని కాపాడుకోవాలని అన్నారు.

డా.ఏనుగు నరసింహ రెడ్డి

అప్పుడు తెలంగాణ కవులు పూజ్యం.. ఇప్పుడు తెలంగాణ కవుల రాజ్యం అని డా.ఏనుగు నరసింహ రెడ్డి అన్నారు. ఇదంతా తెలంగాణ సారస్వత పరిషత్, భారత జాగృతి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తోనే సాధ్యమైందని అన్నారు. ముఖ్యమంత్రులు కవితలు రాస్తారా అంటే.. అప్పటి మన సీఎం బూర్గుల రామకృష్ణారావు కవి, పీవీ నరసింహ రావు కవి, అనువాదకుడు ఇప్పుడు కేసీఆర్ గేయ రచయిత.. ఇదంతా తెలంగాణ సొంతం అని వివ‌రించారు. తెలంగాణ జాగృతి తంగేడు పత్రిక నడిపిస్తుంది.. కవులు కళాకారులను ప్రోత్సహిస్తుంది.. సాహిత్య సభలు ప్రతి సంవత్సరం నిర్వహించడం అభినందనీయమ‌న్నారు. తెలంగాణలో సాహిత్యం, కవులు వర్ధిల్లుతున్నారని.. భాషను కూడా పరిరక్షించాలని భారత జాగృతిని కోరారు.


Next Story