హైదరాబాద్: రాష్ట్రంలో గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోని 1.59 లక్షల కార్డులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిపై విచారణ చేపట్టాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు విచారణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఇప్పటికే 80 శాతం కార్డులను పరిశీలించిన అధికారులు.. వీటిలో 30 శాతం అర్హత లేనివని గుర్తించారు.
కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన లిస్ట్ ప్రకారం.. ఇతర రాష్ట్రాల్లో కార్డులు కలిగి ఉండటం, కార్డు హోల్డర్లు మరణించడం, డూప్లికేట్ ఆధార్తో కార్డులు పొందడం వంటి లోపాలు ఉన్నాయి. ఈ కార్డులను రీ వెరిఫికేషన్ చేయాలని కేంద్రం రాష్ట్రానికి సూచించింది. అనర్హతకు గల కారణాలను పరిశీలించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియతో చాలా కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులు.. క్షేత్రస్థాయి విచారణను చేపట్టి, సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
చాలా వరకు 6 నుంచి 12 నెలలుగా రేషన్ తీసుకోని కార్డుల్లో పలువురు అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు బతుకుదెరువు కోసం రాష్ట్రానికి వచ్చి రేషన్ కార్డులు తీసుకున్నవారు తిరిగి స్వస్థలాలకు వెళ్లడంతో కూడా రేషన్ సరుకులు తీసుకోవడం లేదు. రేషన్ కార్డుల పరిశీలన చివరి దశలో ఉంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత అనర్హత కారణాలతో కేంద్రం పంపిన లిస్టులో ఉన్న చాలా వరకు కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అటు రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు కొత్త రేషన్ కార్డులను కూడా ఇస్తోంది.