తెలంగాణ అసెంబ్లీ ఆదివారం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంటూ 'తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు - 2026'ను ఏకగ్రీవంగా ఆమోదించింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెచ్చిన ఈ చట్టం, గతంలోని కేంద్ర చట్టాల కంటే ఎంతో శక్తివంతమైనదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ నూతన చట్టం ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా, ఎమ్మెల్యేలు, ఎంపీలు వంటి ప్రజాప్రతినిధులు మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా తమ తల్లిదండ్రులను తప్పనిసరిగా సంరక్షించాలి. ఒకవేళ ఎవరైనా తమ బాధ్యతను విస్మరించి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, వారి వేతనం నుండి 15 శాతం లేదా గరిష్టంగా ₹10,000 కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రులకు అందజేస్తారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్పథ్ సింఘానియా ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఆస్తులన్నీ రాసిచ్చాక కన్నబిడ్డలే బయటకు పంపే పరిస్థితి రావడం దురదృష్టకరమని, అందుకే ఈ సామాజిక బాధ్యతతో కూడిన చట్టాన్ని తెచ్చామని సీఎం వివరించారు. తల్లిదండ్రులను గౌరవించని వారికి సమాజంలో నివసించే హక్కు లేదని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.