ఆ భూముల సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలి..కేంద్రమంత్రిని కోరిన శ్రీధర్‌బాబు

భూముల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల,వాణిజ్య శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు కోరారు.

By Knakam Karthik
Published on : 25 Jun 2025 2:32 PM IST

Telangana, IT Minister Sridhar Babu,  Congress Government, Union Minister Kumaraswamy

ఆ భూముల సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలి..కేంద్రమంత్రిని కోరిన శ్రీధర్‌బాబు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూముల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల,వాణిజ్య శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఈ విషయంపై చర్చించారు. 1960లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన కోసం హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను భారీ ఎత్తున రాయితీ ధరలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించింది. అయితే కాలక్రమంలో వాటిలో అనేక సంస్థలు మూతపడటం, ఉత్పత్తిని నిలిపివేయడం వాటి పరిధిలోని విస్తీర్ణ భూములు ప్రస్తుతానికి నిరుపయోగంగా ఉండడమే కాకుండా, కొన్ని సంస్థలు భూములను వాణిజ్య పరంగా వినియోగానికి మార్పు చేసుకోవాలన్న యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో వివిధ జిల్లాల్లో ఉన్న ముఖ్యమైన సీపీఎస్‌యూలు కింద భూకేటాయింపుల వివరాలు :

1. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, మేడ్చల్-మల్కాజిగిరి – 324.87 ఎకరాలు

2. హిందుస్తాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్, సంగారెడ్డి – 126.33 ఎకరాలు

3. ఐడీపీఎల్, మేడ్చల్-మల్కాజిగిరి – 551.03 ఎకరాలు

4. హెచ్‌ఎంటీ, మేడ్చల్-మల్కాజిగిరి – 888.05 ఎకరాలు

5. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), ఆదిలాబాద్ – 2,272.85 ఎకరాలు

6. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఎద్దుమైలారం, సంగారెడ్డి – 3,020 ఎకరాలు

ఈ భూములు ఉపయోగంలో లేకుండా ఉండటం, పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ ఎటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేకపోవడం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని మంత్రి స్పష్టం చేశారు. సరైన పరిహారం లేకుండానే భూములను ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేయడం వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని, భూముల ఉద్దేశ్యపూర్వక వినియోగానికి మార్గదర్శకాలు రూపొందించాలని, రాష్ట్రానికి సముచిత ప్రయోజనం లభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేయగా అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఈ విషయమై సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story