హైదరాబాద్ మెట్రో రైల్వే ప్రాజెక్టు రెండో దశలో భాగంగా వారసత్వ కట్టడాలైన చార్మినార్, ఫలక్నుమాల సమీపంలో ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. వారసత్వ కట్టడాల పరిరక్షణపై అధ్యయనం లేకుండా, వాటి సమీపంలో మెట్రో కారిడార్-6 పనులు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (ఏపీడబ్ల్యూఎఫ్) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్, న్యాయమూర్తి రేణుకా యారాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న మెట్రో ప్రాజెక్టు కారణంగా పాత నగరంలోని అనేక చారిత్రాత్మక కట్టడాలు ముప్పు పొంచి ఉన్నాయని పిటిషనర్ రహీమ్ ఖాన్ పేర్కొన్నారు. తెలంగాణ వారసత్వ కట్టడాల రక్షణ చట్టం, కేంద్ర పురావస్తు శాఖ చట్టం నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్నాకే పనులు చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాల గడువు కావాలని అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాజ్ఖాన్ కోరగా ధర్మాసనం అనుమతిస్తూ విచారణను వాయిదా వేసింది.