ఖదీర్‌ఖాన్‌ మృతిపై ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేయాలి: షబ్బీర్‌ అలీ

Telangana govt should constitute SIT to probe Medak death.. Shabbir Ali. హైదరాబాద్‌: మెదక్‌ పోలీసు సిబ్బంది చేత తీవ్ర గాయాలపాలై మృతి చెందిన మహ్మద్‌

By అంజి  Published on  19 Feb 2023 11:33 AM GMT
ఖదీర్‌ఖాన్‌ మృతిపై ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేయాలి: షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌: మెదక్‌ పోలీసు సిబ్బంది చేత తీవ్ర గాయాలపాలై మృతి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఖదీర్‌ఖాన్‌ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదివారం డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ఈ చర్యలో పాల్గొన్న పోలీసులందరిపై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కస్టడీ మరణాన్ని కప్పిపుచ్చేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించడాన్ని షబ్బీర్ అలీ తీవ్రంగా ఖండించారు.

''ఈ అంశంపై రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఖదీర్ ఖాన్ కస్టడీ మరణాన్ని కనీసం ఎందుకు అంగీకరించడం లేదు? ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’కి కేసీఆర్ ప్రభుత్వ ఉదాహరణ ఇదేనా?'' అంటూ ప్రశ్నించారు. పోలీసుల చిత్రహింసల కారణంగా ఖదీర్ ఖాన్ మృతి చెందడం తెలంగాణ పోలీసుల పనితీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నదని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్‌ అలీ అన్నారు.

''ఖదీర్ ఖాన్ మొదట దొంగతనం కేసులో అనుమానితుడిగా హైదరాబాద్ పాతబస్తీ నుండి తీసుకెళ్లారు. మెదక్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఐదు రోజుల పాటు దారుణంగా చిత్రహింసలకు గురిచేసి, అక్రమ గృహనిర్బంధంలో ఉంచారు. అతను అనేక దెబ్బలు తినడంతో, మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతున్నప్పటికీ అతనికి వైద్య సహాయం నిరాకరించబడింది. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరేందుకు గృహనిర్బంధం నుంచి తప్పించుకోవలసి వచ్చింది. ఖదీర్ ఖాన్ ఆసుపత్రిలో చేరినప్పటి నుండి ఈ సంఘటన గురించి మీడియా నివేదిస్తోంది. పోలీసులు ఎలా హింసించారో వివరిస్తూ బాధితుడు స్వయంగా వీడియో రికార్డ్ చేశాడు. కానీ హోంమంత్రి, డిజిపి లేదా ఇతర పోలీసు అధికారులు స్పందించలేదు. ఇప్పుడు అతని మరణం తరువాత ప్రతిదీ కప్పిపుచ్చే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు'' అని అన్నారు.

కస్టడీ మరణాలు, చిత్రహింసలకు తెలంగాణ రాజధానిగా మారుతోందని షబ్బీర్ అలీ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దళిత మహిళ మరియమ్మ, ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌లను పోలీసులు దారుణంగా చిత్రహింసలకు గురిచేశారని, ఆ తర్వాత మరియమ్మ 2021 జూలైలో చనిపోయిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో మరో రెండు కేసులు నమోదయ్యాయి.

Next Story