గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు విడుదల

Telangana govt releases Rs 364 cr funds for Gram Panchayats, Municipalities. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, 699 గ్రామ

By అంజి  Published on  24 Feb 2022 12:54 PM GMT
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు విడుదల

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, 699 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.364 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులను బుధవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 21న నారాయణఖేడ్‌లో జరిగిన పర్యటనలో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి.. మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయడంతో పాటు 699 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షలు చొప్పున‌ విడుదల చేస్తానని హామీ ఇచ్చారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలకు రూ.50 కోట్లు, నారాయణఖేడ్, సదాశివపేట, జోగిపేట్, ఐడీఏ బొల్లారం, అమీన్‌పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున నిధుల‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 699 పంచాయతీల్లో 647 సంగారెడ్డి జిల్లాలో ఉండగా, అందోలు నియోజకవర్గంలో భాగమైన మిగిలిన 52 పంచాయతీలు మెదక్ జిల్లాలో ఉన్నాయి. వెంటనే నిధులు విడుదల చేసినందుకు ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, తదితరులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. గ్రామాలు, మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు, ఇతరత్రా అభివృద్ధి చేయడం ద్వారా నిధులను సక్రమంగా వినియోగించేలా చూస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి గ్రామపంచాయతీలు పాలాభిషేకం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ వేగంగా స్పందించినందుకు జహీరాబాద్‌ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్లు ​​తదితరులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, నిధులను సమర్ధవంతంగా ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అధికారులను ఆర్థిక మంత్రి టీ హరీశరావు ఆదేశించారు.

Next Story