హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద.. ఇంటిని 600 చదరపు అడుగుల్లోపు నిర్మిస్తేనే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ స్పష్టం చేశారు. 600 దాటితే పథకానికి అనర్హులని తెలిపారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను 400 నుంచి 600 ఎస్ఎఫ్టీ లోపే నిర్మించాలని సూచించారు. 600 చదరపు అడుగుల దాటితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హులు అవుతారని తెలిపారు.
రాష్ట్రంలో 2,832 మంది బేస్మెంట్ నిర్మాణాలు పూర్తి చేయగా.. అందులో 285 మంది ఎక్కువ విస్తీర్ణలో ఇంటి నిర్మాణం చేస్తున్నట్టు అధికారుల తనిఖీల్లో తేలిందన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి సాయం అందడంలో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. 600 చదరపు అడుగులు దాటితే వాళ్లు బీపీఎల్ కుటుంబాల కిందకు రారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయం కూడా అందదని, ఆడిట్ లో ఇబ్బందులు వస్తాయని ఎండీ గౌతమ్ చెప్పారు. 600 కంటే ఎక్కువ చదరపు అడుగుల్లో ఇళ్లు నిర్మిస్తున్న లబ్ధిదారుల అర్హతను మరో సారి పరిశీలించాలని జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో ఎండీ ఆదేశించారు.