Telangana Govt: జూ.పంచాయతీ కార్యదర్శులకు నియామ‌క ఉత్త‌ర్వులు జారీ

70 శాతం మార్కులు సాధించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నియామక ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By అంజి  Published on  9 Aug 2023 2:45 AM GMT
Telangana Govt,District Collectors,Jr Panchayat Secretaries, Telangana

Telangana Govt: జూ.పంచాయతీ కార్యదర్శులకు నియామ‌క ఉత్త‌ర్వులు జారీ

హైదరాబాద్: జిల్లా స్థాయి పనితీరు మూల్యాంకన కమిటీలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ IVగా 70 శాతం మార్కులు సాధించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నియామక ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల అగ్రిమెంట్ పీరియడ్‌తో 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. తదనంతరం ఈ వ్యవధిని నాలుగు సంవత్సరాల నిరంతర సేవలకు పొడిగించారు. దీని ప్రకారం.. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును అంచనా వేయడానికి జిల్లా స్థాయి పనితీరు మూల్యాంకన కమిటీలను ఏర్పాటు చేశారు.

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక చేయబడి, కమిటీల మూల్యాంకనంలో 70 శాతం, అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మాత్రమే నియామక ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 70 శాతం సాధించడంలో విఫలమైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి, వారి పనితీరును మరో ఆరు నెలల పాటు పరిశీలించనున్నారు. ఆరు నెలల తర్వాత, వారి పనితీరును కమిటీ మూల్యాంకనం చేస్తుందని, మూల్యాంకనం సమయంలో వారి పనితీరు సంతృప్తికరంగా ఉందని తేలితే, తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జేపీఎస్‌ల ప‌నితీరు, ఇత‌ర వివ‌రాల‌ను యాప్‌లో న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. నియామ‌క ఉత్త‌ర్వుల‌ను కూడా న‌మోదు చేయాల‌ని పేర్కొంది.

మరోవైపు గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు మంగళవారం సమ్మె విరమించి బుధవారం నుంచి విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఇ.దయాకర్‌రావుతో జరిపిన చర్చలు ఫలవంతం కావడం, తమ సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రతి గ్రామ పంచాయతీకి అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2019లో కార్యదర్శులను రాతపరీక్ష ద్వారా 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియమించింది.

Next Story