బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే.. సుప్రీంలో సవాల్ చేసిన తెలంగాణ సర్కార్
బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
By - అంజి |
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే.. సుప్రీంలో సవాల్ చేసిన తెలంగాణ సర్కార్
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం సోమవారం అర్ధరాత్రి పిటీషన్ దాఖలు చేసింది. హైకోర్టు స్టేపై 50 పేజీల సమగ్ర సమాచారంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 50% రిజర్వేషన్లు పరిమితి నియమమే తప్ప రాజ్యాంగ పరమైనది కాదని ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. రిజర్వేషన్లపై 50% పరిమితి విధింపు రాజ్యాంగంలో ఎక్కడా లేదని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పై ఒకటి రెండు రోజుల్లో విచారణ జరిగే అవకాశం ఉంది. శనివారం నుంచి పది రోజులపాటు సుప్రీంకోర్టుకు వరుస సెలవులు ఉండనున్నాయి.
ఈ క్రమంలోనే బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసును రిఫరెన్స్గా చూపింది. రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావించింది. 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ దాటొద్దని చెప్పినా అది విద్య, ఉపాధి రంగాలకే పరిమితమని గుర్తు చేసింది. ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లు ఇవ్వొచ్చని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపింది. సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కుల సర్వే - 2024 - 25లో రాష్ట్ర జనాభాలో 56.33 శాతం మంది బీసీలు ఉన్నారు.