తెలంగాణలో మరో 5 సంస్థల పెట్టుబడులు, 5020 మందికి ఉపాధి..మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం..అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
By Knakam Karthik
తెలంగాణలో మరో 5 సంస్థల పెట్టుబడులు, 5020 మందికి ఉపాధి..మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం..అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పం అని మంత్రి పేర్కొన్నారు. యూఏఈకి చెందిన ప్రముఖ కంపెనీలు శైవా గ్రూప్, తారానిస్ క్యాపిటల్ సంస్థలు రాష్ట్రానికి చెందిన ఐదు సంస్థలతో సచివాలయంలో మంత్రి సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో రూ.2,125 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. దీని వల్ల 5,020 మందికి ఉపాధి లభించనున్నట్లు సంస్థలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ 18 నెలల కాంగ్రెస్ పాలనలో 60వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చాం. ఫలితంగా ప్రైవేట్ రంగంలో లక్ష మందికి పైగా తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభించాయి. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో ఈరోజు మరో గొప్ప అడుగు వేయబోతున్నాం. కొత్తగా మరో 5,020 మంది తెలంగాణ యువతకు ఉపాధి దక్కబోతుందనే విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ధీటుగా దూసుకెళ్తున్న తెలంగాణ పురోగతిలో భాగస్వామయ్యేందుకు ముందుకొచ్చిన యూఏఈకి చెందిన ప్రముఖ కంపెనీలు శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ను ప్రభుత్వం తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాం..అని మంత్రి పేర్కొన్నారు.
ఇది తొలి అడుగు మాత్రమే. రాబోయే మూడేళ్లలో బయోటెక్, ఏఐ, డేటా సెంటర్, డిఫెన్స్, ఎనర్జీ, ఫిన్ టెక్, పబ్లిక్ సెక్టార్స్ తదితర రంగాల్లో లో మరో రూ.24వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ రెండు కంపెనీలు రాబోయే మూడేళ్లలో బయోటెక్ రంగంలో తినుబండారాల్లో చక్కెర శాతాన్ని తగ్గించడం, యాంటీ డయాబెటిక్, ఫుడ్ మేనేజ్ మెంట్ ప్రొడక్ట్స్ పై ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. పబ్లిక్ సెక్టార్ విషయానికొస్తే ఫోర్త్ సిటీ, ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి... ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకొచ్చిన వీరికి ప్రత్యేక ధన్యవాదాలు.
కొందరు రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు... పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయంటూ మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారికి మేం తీసుకొస్తున్న పెట్టుబుడులు, ఉద్యోగాలు కనిపించడం లేదా..? ఒక్కసారి ఆలోచించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నా. ఇక్కడి యువత ప్రతిభే మాకున్న పెద్ద ఆస్తి. డిగ్రీ, ఇంజినీరింగ్ పట్టా తీసుకుని బయటికొచ్చే విద్యార్థుల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఉండటం లేదనే ఫిర్యాదు పారిశ్రామికవేత్తల నుంచి తరచూ వస్తోంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశాం. మీ అందరి భాగస్వామ్యంతో కోర్సులకు రూపకల్పన చేసి.. మీకు కావాల్సిన మానవ వనరులను రెడీమేడ్ గా అందిస్తున్నాం. మీకు ఖర్చు, శ్రమ తగ్గిస్తున్నాం. తెలంగాణ ఒక రాష్ట్రం కాదు... అవకాశాల గని. ప్రతిభకు కేరాఫ్ అడ్రస్. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత, ఆవిష్కరణలకు కేంద్రం. అంతర్జాతీయ భాగస్వామ్యాలకు గమ్యస్థానం. మీ ఎదుగుదలే... మా రాష్ట్రాభివృద్ధి అని నమ్మే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. అందుకే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ వేదిక ద్వారా మరోసారి ఆహ్వానం పలుకుతున్నా..అని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.