తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..అక్కడ 450 ఎకరాల్లో ఐటీ హబ్ ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..అక్కడ 450 ఎకరాల్లో ఐటీ హబ్ ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పుప్పాలగూడ పరిసరాల్లో సుమారు 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. గురువారం సాయంత్రం అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి కలిసి సీఎస్ శాంతి కుమారి, పరిశ్రమల, రెవెన్యూ శాఖ కీలక అధికారులతో సమావేశం నిర్వహించారు.
పుప్పాలగూడ పరిసరాల్లో ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఐఏఎస్ అధికారుల కోసం ప్రభుత్వం గతంలో స్థలాలు కేటాయించింది. వీరితోపాటు రెవిన్యూ అధికారులు, స్పెషల్ పోలీస్ మ్యూచువల్ కో-ఆపరేటివ్ సొసైటీ తదితర సొసైటీలకు సుమారు 200 ఎకరాలకు పైచిలుకు భూమిని ప్రభుత్వం కేటాయించింది. పుప్పాలగూడ పరిధిలో సొసైటీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు సబ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ భూమికి పక్కనే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కు సంబంధించిన సుమారు 250 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లుగా అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. మొత్తంగా మొదటి దశలో ఐటి నాలెడ్జ్ హబ్ అభివృద్ధికి సుమారు 450 ఎకరాలు అందుబాటులో ఉంది అని చెప్పారు. మొదటి దశలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ హబ్ ద్వారా ఐదు లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని అధికారులు మంత్రుల బృందానికి సూచించారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలో హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగింది, ఆ తర్వాత నాలెడ్జ్ హబ్ ఏర్పాటయింది, ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రూపు దిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాల్లో వచ్చిన ప్రతి మార్పులో హైదరాబాద్ భాగస్వామి అయిందని, ఇప్పుడు కూడా ఐటీ రంగంలో AI టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పును హైదరాబాద్ అందిపుచ్చుకోవాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధిలో సుస్థిర స్థానాన్ని ఇప్పటికే సాధించింది, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవడం సాధ్యం కాదని ఆర్థికవేత్తలు స్పష్టం చేసిన విషయాన్ని మంత్రులు చర్చించారు. అభివృద్ధిని కొనసాగించే క్రమంలో పుప్పాలగూడలో 450 ఎకరాల్లో నాలెడ్జ్ హబ్ అభివృద్ధి చేస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న హైదరాబాద్ ప్రగతిని వేగవంతం చేయాలని నిర్ణయించారు.