తెలంగాణ రాష్ట్రం మరో ఉద్యమ కారుడిని కోల్పోయింది. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ చిరంజీవి కొల్లూరి(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఇటీవల చిరంజీవి కుటుంబం ఆస్పత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉందని తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. సీఎంఆర్ఎఫ్ నిధి నుంచి రూ. 10 లక్షలు మంజూరు చేయించారు. మంత్రి ఈటల రాజేందర్ స్వయంగా హాస్పిటల్కు వెళ్లి ప్రభుత్వ సహాయాన్ని అందజేశారు.
సీఎం సంతాపం
తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీయమన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే చిరంజీవి మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.