హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్ర భవిష్యత్తును మార్చే పలు కీలక బిల్లులు మరియు విధానపరమైన నిర్ణయాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. సమాజంలో అశాంతిని రేకెత్తించే విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల నియంత్రణ కోసం కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే, వేలాది మంది డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్ల ప్రయోజనాల కోసం 'తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లు'తో పాటు న్యాయవాదుల భద్రత కోసం 'అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు'కు ఆమోదం తెలిపింది. మరో భారీ నిర్ణయంగా, ఎల్ అండ్ టీ (L&T) నిర్వహణలో ఉన్న హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన లావాదేవీల బాధ్యతను హెచ్ఎమ్ఆర్ఎల్ (HMRL)కు అప్పగించింది. వీటితో పాటు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ సమర్పించిన అత్యంత కీలకమైన కుల గణన నివేదికకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.