తెలంగాణ బడ్జెట్‌: హైకోర్టులో గవర్నర్‌పై కేసీఆర్‌ సర్కార్‌ పిటిషన్‌

Telangana Budget.. KCR Sarkar petition against Governor in High Court. హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్

By అంజి  Published on  30 Jan 2023 6:13 AM GMT
తెలంగాణ బడ్జెట్‌: హైకోర్టులో గవర్నర్‌పై కేసీఆర్‌ సర్కార్‌ పిటిషన్‌

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ (ఎల్‌ఎంపి) దాఖలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. 2023 - 24 తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ వైఖరిని సవాల్ చేస్తూ అడ్వకేట్ జనరల్ బండా శివానంద ప్రసాద్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతించేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోర్టును కోరారు.

దీనిపై మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణ చేపట్టాలని ఏజీ బీఎస్ ప్రసాద్ కోర్టును అభ్యర్థించారు. రాష్ట్రం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే హాజరుకానున్నారు. గవర్నర్‌ను హైకోర్టు ఎలా నిర్దేశిస్తుందని ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ప్రశ్నించారు. గవర్నర్‌కు కోర్టు నోటీసు ఇవ్వగలదా? అన్నది ఆలోచించుకోవాలని అడ్వకేట్‌ జనరల్‌కు సూచించారు. గవర్నర్‌ విధులపై కోర్టు న్యాయసమీక్ష చేయవచ్చా? అని ప్రశ్నించారు. అయితే ఇది రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన అంశమని, సమయాభావం కారణంగా ఈ సమస్యపై విచారణ జరగవచ్చని ఏజీ ప్రసాద్‌ కోర్టుకు తెలియజేసినట్లు సీజే భుయాన్‌ సూచించారు. ఈ అంశం మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరగనుంది.

Next Story