TG: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik
TG: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్లులను మంజూరు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం మొత్తంగా ఒకే రోజున రూ.153 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసి నేటికీ బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నామని మాజీ సర్పంచులు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు మొదలగు అనేక కార్యక్రమాలు విడతలుగా వారివారి సొంత డబ్బులతో చేపట్టినట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
కాగా గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు భారీ మొత్తంలో నిధులు పెండింగ్లో పెట్టిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 9990 బిల్లులు ఒకే రోజున క్లియర్ చేసింది. 2024 ఆగస్టు వరకు పెండింగ్లో ఉన్న బిల్లుల నిధులకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇందుకు గాను ఒకే విడతలో రూ.10 లక్షల లోపు బిల్లులను సర్కారు చెల్లించింది. వీటితో పాటుగా ఎస్డీఎఫ్(ప్రత్యేక అభివృద్ధి నిధి) కింద చేపట్టిన వివిధ పనులకు రూ.85 కోట్లను సైతం విడుదల చేసింది.