యాక్షన్‌లోకి దిగిన మానవ హక్కుల కమిషన్

హైదరాబాద్‌లో ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది.

By -  Medi Samrat
Published on : 4 Dec 2025 8:50 PM IST

యాక్షన్‌లోకి దిగిన మానవ హక్కుల కమిషన్

హైదరాబాద్‌లో ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నగర శివారులోని హయత్ నగర్ శివగంగా కాలనీలో ప్రేమ్‌చంద్ అనే ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్, జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని కోరింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, బాలుడి ప్రస్తుత పరిస్థితి, కుక్కల స్టెరిలైజేషన్, నియంత్రణ చర్యల స్థితిగతులను నివేదికలో పేర్కొనాలని ఆదేశించింది.

హయత్‌నగర్‌లో బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బాలుడి పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వారిని అదేశించారు.

Next Story