మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట
కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు న్యాయమైన పరిహారం అందించాలని ప్రజల పక్షాన ప్రస్తుత ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పోరాటం చేశారు.
By Medi Samrat
కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు న్యాయమైన పరిహారం అందించాలని ప్రజల పక్షాన ప్రస్తుత ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో 2017 లో పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసులు ఆయనతో పాటు హర్కర వేణుగోపాల్, అన్నయ్య గౌడ్, శశిభూషణ్ కాచె, మరో 9 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేస్తూ నాంపల్లి లోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శనివారం తుది తీర్పును వెల్లడించింది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజా విజయం. రైతుల విజయం. పేద రైతుల ఘోషను ఈ న్యాయస్థానం అర్ధం చేసుకుంది. ఈ తీర్పు న్యాయ వ్యవస్థపై మరింత గౌరవాన్ని పెంచింది. మనది ప్రజాస్వామ్య దేశం. తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాలి. కానీ.. అధికారం ఉంది కదా అని మాపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి మాపై అక్రమ కేసులు బనాయించింది. మేం న్యాయస్థానంపై పూర్తి విశ్వాసం ఉంచి.. న్యాయపరంగా 8 ఏళ్లు పోరాటం చేశాం. చివరకూ న్యాయమే గెలిచిందన్నారు.
కాళేశ్వరంతో మా ప్రాంతానికి ఒరిగిందేం లేదు. ఎంతో అన్యాయం జరిగింది. మా ప్రజలు ఉపాధి కోల్పోయారు. అసలు వాళ్లు కట్టిన ప్రాజెక్ట్ నిలవలేదు. త్వరలోనే ఈ వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. చుక్క నీరు ఇవ్వకుండా కాళేశ్వరం పేరిట వేలాది ఎకరాలు రైతుల నుంచి ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండానే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంది. అన్నదాతల కడుపు కొట్టి ఆ పార్టీ నేతలు అక్రమంగా సంపాదించుకున్నారన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రజా విచారణ చేస్తున్న సందర్భంగా రైతుల హక్కులను కాపాడాలని విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చేందుకు అక్కడికి వెళ్తే.. అధికారం ఉందని మాపై అన్యాయంగా వివిధ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారన్నారు. అన్నదాతల తరఫున వారి గొంతుకగా.. మా మంథని ప్రజల కోసం పోరాటం చేస్తే నాతో పాటు, స్థానిక కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. అసలు అక్కడ లేని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చి కొందరు బీఆర్ఎస్ నేతలు రాక్షసానందం పొందారన్నారు.
ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం నడి రోడ్డుపై న్యాయవాది దంపతులను చంపితే.. అసలు నేరస్థులను బయటకు రాకుండా కాపాడింది. ఎప్పటికైనా అసలు దోషులకు తప్పకుండా శిక్ష పడుతుందనే నమ్మకం మాకుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం అనే మాటే లేదు. అంతా నిరంకుశత్వం. ప్రశ్నిస్తే చాలూ... అక్రమ కేసులు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు వెళ్తుంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తుందన్నారు.