గుడ్ న్యూస్..రేపటి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్
జూన్ 2వ తేదీ నుంచి మిగిలిన 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు.
By Knakam Karthik
గుడ్ న్యూస్..రేపటి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్
తెలంగాణలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు కృత్రిమ మేధ (ఏఐ)సేవలను ఉపయోగించుకొని ప్రజలకు మరింత సులువైన సమర్ధవంతమైన సేవలను అందించబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా రెండు విడతల్లో 47 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలుచేయగా తాజాగా జూన్ 2వ తేదీ నుంచి మిగిలిన 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఆదివారం స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆస్తుల క్రయ విక్రయదారులకు సమయం ఆదా అయ్యేలా పారదర్శకంగా అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానం వల్ల తాము అనుకున్న విధంగానే సత్ఫలితాలు వచ్చాయని, 94 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. మొదటి దశలో 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఏప్రిల్ 10 నుంచి ఇప్పటివరకు 30,592 డాక్యుమెంట్లు , రెండో దశలో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మే 12 నుంచి ఇప్పటివరకు 14,099 డాక్యుమెంట్లు మొత్తం 45,191 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయని, స్లాట్ బుకింగ్ వల్ల మూడు వేల డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయని తెలిపారు. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు, మనోభీష్టం మేరకే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని అమలుచేస్తుందన్నారు. అంతిమంగా ప్రజలకు సంతృప్తికర సేవలు అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ -ఏఐ) అనుసంధానంతో కూడిన చాట్బాట్ - మేధ 82476 23578 వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి వెల్లడించారు. ఈ నూతన ప్రక్రియ వల్ల రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కలిగే సందేహాలు నివృత్తి అవుతాయని అంతేగాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీల వివరాలు, సమయం అందుబాటు వంటి సమాచారం లభిస్తుందన్నారు. గిప్ట్ డీడ్, సేల్ డీడ్ పై రిజిస్ట్రేషన్ ఛార్జీలు మార్కెట్ ధరలు తదితర అన్ని అంశాలపై ఈ ఎఐ చాట్బాట్ - మేధ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని.. మంత్రి పొంగులేటి వెల్లడించారు.