కోతులను వండుకుని తిన్నారు
మాంసాహారానికి అలవాటు పడిన వ్యక్తులు కోడి, మేకలు లాంటి వాటిని చంపి తినడం మనకు తెలుసు.
By Medi Samrat Published on 13 Dec 2023 6:15 PM IST
మాంసాహారానికి అలవాటు పడిన వ్యక్తులు కోడి, మేకలు లాంటి వాటిని చంపి తినడం మనకు తెలుసు. మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కుక్కలను కూడా తింటారని మనం విన్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో కోతులను చంపి.. వండుకుని తిన్న ఘటన గురించి తెలిసి ప్రజలు ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చింతలబోరి గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు తిన్నదంతా కక్కేలా దేహ శుద్ధి చేశారు.
చింతలబోరి గ్రామంలో కొందరు వ్యక్తులు కోతులను చంపి తిన్నారు. నాలుగు కోతులను పట్టుకుని చంపి వండుకుని తిన్నవారిని గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. వీరు సంచార జాతులకు చెందినవారని అనుమానిస్తున్నారు. కోతులను తాము దైవంతో సమానంగా పూజిస్తామని, వాటిని చంపితినడం సరికాదని హెచ్చరించారు. గ్రామ శివారులోని వారి గుడారాల వద్దకు వెళ్లి కోతులను తిన్న వ్యక్తులతో గ్రామస్థులు గొడవకు దిగారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్థులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.