విద్యుత్‌ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట ఫస్ట్, గజ్వేల్ సెకండ్: సీఎం

తెలంగాణలో విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంలో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

By అంజి  Published on  22 Dec 2023 3:21 AM GMT
Siddipet, Gajwel, power bills, CM Revanth Reddy, Hyderabad

విద్యుత్‌ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట ఫస్ట్, గజ్వేల్ సెకండ్: సీఎం

తెలంగాణలో విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంలో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 61.37 శాతం బకాయిలతో సిద్దిపేట మొదటి స్థానంలో ఉండగా, గజ్వేల్ (50.29 శాతం బకాయిలు), విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్ బిల్లుల చెల్లింపులో 43 శాతం బకాయిలతో హైదరాబాద్ సౌత్ మూడో స్థానంలో నిలిచాయి. రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.

సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు, గజ్వేల్‌ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఏఐఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీలు ఆయా నియోజకవర్గాల్లో విద్యుత్‌ బిల్లుల బకాయిలు తీర్చే బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని బీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు, మాజీ విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ కోసం రైతులెవరూ ధర్నా చేయలేదని పేర్కొన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం జగదీష్ రెడ్డిపై ఎదురుదాడికి దిగారు.

కామారెడ్డిలో సెప్టెంబరు 1న రైతులు ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్‌ను ముట్టడించి నిరసన తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన రైతులు రోడ్డెక్కారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కరెంటు లేకపోవడం, పంటలు దెబ్బతినడంతో కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి సొరంగం పేలి తొమ్మిది మంది మృతి చెందారని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.

“ప్రమాదంలో మరణించిన ఫాతిమా కుటుంబాన్ని కాంగ్రెస్ ఆదుకుంది. అప్పటి ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి కూడా బాధిత కుటుంబాలను పరామర్శించలేదు' అని ఆయన అన్నారు. ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీకి రేవంత్ రెడ్డి ఓ సలహా కూడా ఇచ్చారు. “ఏఐఎంఐఎం బీఆర్‌ఎస్ ప్రభుత్వ దుర్మార్గాలను సభలో ప్రస్తావించలేదు. అక్బరుద్దీన్ తన పాత స్నేహితుడిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు'' అని ఆయన అన్నారు.

అలాంటి వారితో స్నేహం ఎంఐఎంకు మంచిది కాదు. మైనార్టీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ హయాం నుంచి కేసీఆర్ హయాం వరకు ఎవరు ఎవరితో దోస్తీ చేశారో అందరికీ తెలిసిందే. ఈ అంశంపై మరో సారి చర్చిద్దాం అని ముఖ్యమంత్రి అన్నారు.

Next Story