ప్రభుత్వంపై విషం కక్కే వంతు ఆమెకు వచ్చింది.. కవితపై ఎంపీ చామల విమర్శలు

కేటీఆర్, హరీష్‌రావు తర్వాత ప్రభుత్వంపై విషం కక్కే వంతు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు.

By Knakam Karthik  Published on  31 Jan 2025 3:48 PM IST
Telangana, congress, Mp Chamala Kirankumar reddy, Brs Mlc Kavitha

ప్రభుత్వంపై విషం కక్కే వంతు ఆమెకు వచ్చింది.. కవితపై ఎంపీ చామల విమర్శలు

కేటీఆర్, హరీష్‌రావు తర్వాత ప్రభుత్వంపై విషం కక్కే వంతు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాట్లాడుతున్న కవిత, బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడిందని చెప్తున్నారు.. అది నిలబడలేదు పేక మేడలా కూలిందని తెలుసుకోవాలని హితవు పలికారు. జైల్లో కవిత బిజీగా ఉన్న సమయంలో పేపర్‌లో వచ్చిన వార్తలు చదవనట్లు ఉన్నారని సెటైర్ వేశారు.

కాళేశ్వరంపై వేసిన జస్టిస్ ఘోష్ కమిటీ అసలు నిజాలను బయటపెట్టిందని, ఎమ్మెల్సీ కవిత మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే మాట్లాడుతున్నారని విమర్శించారు. గోదావరి, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, మానేరుపై గతంలో కాంగ్రెస్ నిర్మించిన ఏ ప్రాజెక్టులు కూలిపోలేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు కూలిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, ఏం చేయాలనే స్పష్టత తమకుందని ఎంపీ చామల అన్నారు.

తెలంగాణ ప్రజలకు వాస్తవాలు ప్రయత్నం చేయాలని ఎమ్మెల్సీ కవితకు సూచించారు. కృష్ణా జలాలతో రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ ఆంధ్రకు వెళ్లి చెప్పివచ్చారని, బీఆర్ఎస్ అసమర్థ పాలన కారణంగా పోతిరెడ్డిపాడులో రోజుకు రెండు టీఎంసీల నీళ్లను జగన్ తీసుకెళ్లారని ఎంపీ చామల ఆరోపించారు. నీటి విషయంలో తెలంగాణకు న్యాయం చేసే అంశంలో ఎంతవరకైనా ముందుకెళ్తామని ఎంపీ చామల స్పష్టం చేశారు.

Next Story