Telangana : సరస్వతీ నదీ పుష్కరాలు.. ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని సరస్వతీ నదీ పుష్కరాలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేషీలో సమీక్ష కొనసాగుతుంది.
By Medi Samrat
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని సరస్వతీ నదీ పుష్కరాలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేషీలో సమీక్ష కొనసాగుతుంది. మే 15నుంచి 26వరకు జరిగే సరస్వతీ నదీ పుష్కరాలపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, ఎల్ఏ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సారథ్యంలో హైదరాబాద్లోని మంత్రి సురేఖ కార్యాలయంలో దేవాదాయ, పంచాయతీరాజ్, ఆర్టీసీ, ఆర్ అండ్ బీ, ట్రాన్స్ పోర్టు తదితర శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ విభాగ హెడ్ లతో సుదీర్ఘ సమీక్ష జరుగుతుంది.
ఈ సమావేశంలో రాష్ట్ర సీఎస్ రామకృష్ణరావు, డీజీపీ జితేందర్, డీజీ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి, సంగీత్ నాటక్ అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల, దేవాదాయ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఆర్ అండ్ బీ, ట్రాన్స్పోర్ట్ ప్రిన్స్ పల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ లోకేష్ కుమార్, సింగరేణి సిఎండీ బల్ రామ్, సీఈఓ సేర్ఫ్ దివ్యా దేవరాజన్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, ఎండోమెంట్ కమిషనర్ వెంకటరావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర శాఖల ఉన్నతాధికారులు, ఆలయ ఈఓ మహేశ్, ఆలయ ప్రధాన, ఉపప్రధాన అర్చకులు పాల్గొన్నారు.
పుష్కరాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్ధం ఏర్పాట్లు, శాశ్వత మరియు తాత్కాలిక ఏర్పాట్లపై చర్చ జరుగుతుంది. కాళేశ్వరం ఒక్క చోటనే సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుతుండడంతో అన్ని రాష్ట్రాల నుంచి రోజుకు లక్షన్నరకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మంత్రులు సురేఖ, శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు అధికారులు చేసిన ఏర్పాట్లపై సమగ్ర చర్చ జరుగుతుంది.