పెళ్ళాం పేరును పచ్చబొట్టుగా.. ఆమెకు కూడా నరకమే చూపించాడట.!

Saidabad Raju Shocking Behavior. సైదాబాద్ కీచకుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి

By Medi Samrat  Published on  16 Sep 2021 9:16 AM GMT
పెళ్ళాం పేరును పచ్చబొట్టుగా.. ఆమెకు కూడా నరకమే చూపించాడట.!

సైదాబాద్ కీచకుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కూడా అది రాజు డెడ్ బాడీ అని తెలిపారు. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. రాజు చేతి మీద మౌనిక అనే పేరు పచ్చబొట్టుగా ఉంది. అది రాజు భార్య పేరు అని తెలుస్తోంది. అయితే.. ఈ రాక్షసుడు భార్యను, భార్య కుటుంబ సభ్యులను కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టాడట..!

రాజుకు రెండేళ్ల‌ క్రితమే సూర్యాపేట జిల్లా జ‌లాల్‌పురం గ్రామానికి చెందిన మౌనిక అనే అమ్మాయితో పెళ్లి జ‌రిగింది. ఆమె పేరునే రెండు చేతుల‌పై రాజు ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నాడు. ఒక చేతిపై మౌనిక పేరు ఇంగ్లిష్‌లో, మ‌రో చేతిపై తెలుగులో రాయించుకున్నాడు. రాజు భార్య ప్ర‌స‌వం కోసం ఏడాది క్రితం జ‌లాల్‌పురం వ‌చ్చి అక్క‌డే ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజు అత్తింటి వారిని కూడా వేధించేవాడ‌ని తెలిసింది. రెండు వారాల క్రితమే జ‌లాల్‌పురం వెళ్లి మ‌ద్యం మ‌త్తులో త‌న అత్త‌పై దాడి చేశాడు.

రాజు ఆత్మహత్యతో అతడి అత్త యాదమ్మ కూడా హ‌ర్షం వ్య‌క్తం చేసింది. తన కుమార్తె మౌనిక జీవితాన్ని రాజు నాశనం చేశాడని, ఇప్పుడు మరో బాలిక‌ జీవితాన్ని కూడా నాశనం చేశాడని బాధను వ్యక్తం చేసింది. త‌న అల్లుడు రాజుకు బతికే హక్కులేదని, అత‌డు ఆత్మహత్య చేసుకుని మంచి పని చేశాడని ఆమె వ్యాఖ్యానించింది. తన కుమార్తె మౌనిక‌కు రాజు వ‌ల్ల వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడద‌ని ఆమె అంది. 15 రోజుల క్రితం రాజు జలాల్‌పురంలోని తమ ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో గొడ‌వ‌ప‌డి రాజు తన గొంతు నొక్కబోతే తన కుమారుడు వచ్చి అడ్డుకున్నాడని యాద‌మ్మ తెలిపింది. అప్పుడు త‌మ గ్రామం నుంచి వెళ్లిన రాజు మ‌ళ్లీ రాలేద‌ని చెప్పింది.


Next Story